RSS chief Mohan Bhagwat: ప్రతి మసీదులో ‘శివలింగం’ ఎందుకు వెతకాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన కామెంట్స్..
RSS chief Mohan Bhagwat: జ్ఞానవాపి మసీదు, మందిర్ వివాదంపై సంచలన కామెంట్స్ చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రతి మసీదులో శివ లింగం ఉందని..
RSS chief Mohan Bhagwat: జ్ఞానవాపి మసీదు, మందిర్ వివాదంపై సంచలన కామెంట్స్ చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రతి మసీదులో శివ లింగం ఉందని శోధించాల్సిన అవసరం లేదని అన్నారు. రోజుకో కొత్త వివాదాన్ని సృష్టించొద్దని అన్నారు. నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తృతీయ సంవత్సరం పదాధికారుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ‘పోరాటం ఎందుకు కొనసాగించాలి? ప్రతి మసీదులో ‘శివలింగం’ కోసం ఎందుకు వెతకాలి?’ అని మోహన్ భగవత్ ప్రశ్నించారు. జ్ఞాన్వాపి వివాదంలో విశ్వాసానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని, అయితే, కోర్టు దానిని పరిష్కరిస్తుందని చెప్పారు. న్యాయస్థానాలను తీర్పును గౌరవించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు మోహన్ భగవత్.
ఇదే సమయలో అయోధ్య అంశంపైనా మోహన్ భగవత్ స్పందించారు. అయోధ్య అంశం వేరు, ఇది వేరు అని అన్నారు. ‘చారిత్రక కారణాల రామజన్మ భూమి కోసం పోరాటం సాగించాం. మేము దానిని పూర్తి చేశాం. నవంబర్ 9న జరిగింది అదే. అయితే, ఇప్పుడు మేం ఏ ఉద్యమానికి నాయకత్వం వహించాలనుకోవడం లేదు.’ అని స్పష్టం చేశారు మోహన్ భగవత్.
“ఇప్పుడు జ్ఞానవాపి మసీదు సమస్య నడుస్తోంది. మనం మార్చలేని చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం రాయలేదు, ఇప్పటి హిందువులు కాదు, ముస్లింలు కాదు. ఇది గతంలో జరిగింది. భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించినప్పుడు భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు, వేలాది దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. వారు చేసేది కూడా పూజనే(నమాజ్). ముస్లింలు కూడా మన పూర్వీకుల నుంచే వచ్చారు. మేం ఏ విధమైన ‘పూజ’కు వ్యతిరేకం కాదు.’’ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
కాగా, జ్ఞాన్వాపి మసీదు కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి కూర్చుని పరస్పర అంగీకారంతో ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, ప్రతిసారి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ప్రజలు కోర్టులను ఆశ్రయించడం జరుగుతుందని, కావున కోర్టు తీర్పులను తప్పక అంగీకరించాలని సూచించారు మోహన్ భగవత్.