ఎన్నికలకు ముందు వరాలు కురిపించిన పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు.. ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. పలు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు..
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. పలు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ప్రజలకు వరాలు కురిపించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కొద్ది నిమిషాలకు ముందు ఈ రెండు రాష్ట్రాలు అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించక ముందే వాటిని ప్రకటించాయి. జనాభాలో అత్యధిక వర్గాలైన కార్మిక, కర్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రకటించడం గమనార్హం. అయితే ఎన్నికల్లో మరోసారి సత్తాచాటేందుకు ప్రజలకు వరాలు కురిపిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్లో కార్మికుల రోజువారీ భృతిని పెంచుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే కొత్తగా పశ్చిమబెంగాల్ అర్బన్ ఎంప్లాయిమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. తద్వారా వివిధ స్థాయిల్లో నైపుణ్యం కలిగిన 56,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆమె తెలిపారు. ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికుల రోజువారీ కూలి రూ.144 నుంచి రూ.2020కు , మధ్య స్థాయి వారి భృతి రూ.172 నుంచి రూ.303, నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాన్ని రూ.404గా ప్రకటించారు.
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి కూడా అక్కడి ప్రజలపై వరాలు కురిపించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆకర్షక పథకాన్ని ప్రవేశపెట్టారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక వృద్ధిని పెంచుకుంటూ సహకార బ్యాంకులు ఆరు శాతం వడ్డీకే బంగారు రుణాలు ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ముఖ్యమంత్రి పళనిస్వామి 16 లక్షల మంది కర్షకులకు రూ.12వేల కట్ల పంట రుణాలను ప్రకటించారు. ఈ రెండు నిర్ణయాలతో రైతులకు లబ్ది చేకూరనుంది. మరో వైపు పుదుశ్చేరిలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలపై 2శాతం వరకు వ్యాట్ను తగ్గిస్తూ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఈ రెండు రాష్ట్రాలు ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటూ ప్రకటించాయి. ఇలా ప్రజలపై వరాలు కురిపిస్తూ ఓట్లను రాబట్టెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తమకు గెలిపిస్తే మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాలు. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
Also Read:
Assam Elections Date 2021: ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అసోంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల