Viral: నిషేధిత గుట్కా ప్యాకెట్ల ఉన్నాయేమో అని టీ స్టాల్లో పోలీసుల సోదాలు.. లోపల కనిపించింది చూసి షాక్
నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయేమో అని ఓ టీ దుకాణంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ పెద్ద గూడు పుఠాణి బయటపడింది.
Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నిషేధిత గుట్కా ఉత్పత్తుల ఉక్కుపాదం మోపేందుకు అక్కడి పోలీసులు పలు దుకాణాలు, పాన్ డబ్బాలు, టీ షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీ స్టాల్లో తనిఖీలు చేసిన కోయంబత్తూరు(Coimbatore) సిటీ పోలీసులు కంగుతిన్నారు. ఎందుకంటే వారికి అక్కడ దొరికింది గుట్కా కాదు గంజాయి. అది కూడా చాక్లెట్ల రూపంలో. దీనికి సంబంధించి.. టీ స్టాల్ నిర్వహిస్తున్న రాజస్థాన్(Rajasthan)కు చెందిన కేతన్ కుమార్ (30) వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతని పార్టనర్ నర్బత్ సింగ్ పరారీలో ఉన్నాడు. ‘వీడ్ చాక్లెట్’గా స్థానికంగా పిలవబడే 40 కిలోల ఈ మాయదారి మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి చాక్లెట్ ప్యాకెట్లను తీసుకొచ్చి పాఠశాల విద్యార్థులతో పాటు కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు కేతన్ కుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడు దాదాపు 5 గ్రాముల ఒక చాక్లెట్ను రూ.100కి విక్రయిస్తున్నాడు.
‘అవి చూడ్డానికి అచ్చం మాములు చాక్లెట్ల మాదిరిగానే ఉన్నాయి. పైన ప్లాస్టిక్ కవర్ కూడా చుట్టి ఉంది. ప్రాథమింగా ఆ చాక్లెట్లలో గంజాయి మిక్స్ చేశారని తేలింది. పూర్తి నిర్ధారణ కోసం కొన్ని చాక్లెట్ల శాంపిల్స్ ల్యాబ్కి పంపాం. ఇవి ఉత్తరాది రాష్ట్రంలో తయారైనట్లు తెలుస్తోంది. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించాం’ అని ఇన్స్పెక్టర్ ఎస్. ఆనందజోతి తెలిపారు. ఇటీవల తిరుప్పూర్లో కార్మికుల నుంచి ఇలాంటి ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విద్యార్థులు, యువతను టార్గెట్ చేస్తూ మత్తు పదార్థాలు అమ్ముతున్న ఇలాంటి చిరు వ్యాపారులపై ఉచ్చు బిగించాలని, ఇలాంటి వారిని కఠిన కేసులు పెట్టి లోపలెయ్యాలని నగర పోలీసు కమిషనర్ వి.బాలకృష్ణన్ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి