Uttar Pradesh: బాబా చెప్పిన ఆ ఒక్క మాటతో సజీవ సమాధికి సిద్ధమైన యువకుడు.. కట్ చేస్తే సీన్ వేరే లేవెల్లో..
మనదేశంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వీడటం లేదు. కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పే మాయమాటలతో..
మనదేశంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వీడటం లేదు. కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పే మాయమాటలతో నిండు జీవితాలను పణంగా పెడుతున్నారు కొందరు యువకులు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే జరిగింది. స్వామీజీలు, బాబాల మాయమాటలతో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు యువకుడు. అయితే పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతమైంది.
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు ఓ యువకుడిని మాయమాటలతో నమ్మించారు. మనం మనల్ని ఆత్మార్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని నమ్మించారు. అది కూడా దేవీ నవరాత్రులకు ముందే జరిగిపోవాలని హడావుడి చేశారు. దీంతో ఆరడుగుల గొయ్యి తవ్వి, అందులో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు శుభమ్ గోస్వామీ అనే యువకుడు. గొయ్యిపైన వెదురుబొంగులతో కప్పేసి, దానిపైన మట్టిని పూడ్చారు. ఆ తర్వాత గొయ్యిలోకి వెళ్లి పోయాడు యువకుడు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని సమాధిలో నుంచి బయటకి తీశారు.
ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు. దీంతో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యానని పోలీసులకు తెలిపాడు యువకుడు.
పోలీసులు సమయానికి అక్కడికి వెళ్లడంతో ముప్పు తప్పింది. సమాధిని తవ్వి, దానిపై నుంచి వెదురు బొంగులను తీసేసి, యువకుడిని రక్షించారు పోలీసులు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్, దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..