CM Yogi Adityanath: అసెంబ్లీ ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి.. సమాజ్వాదీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 75 జిల్లా పంచాయతీ చైర్ పర్సన్ సీట్లకు గానూ 60కుపైగా స్థానాలను కైవసం చేసుకుంది..
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 75 జిల్లా పంచాయతీ చైర్ పర్సన్ సీట్లకు గానూ 60కుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరు స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వెలువడిన ఈ ఫలితాలు బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అయితే మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో బీజేపీకి చెందిన మద్దతుదారులు చైర్పర్సన్లు విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్సింగ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని అన్నారు. ఇప్పటి లాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల వల్లే ఓడిపోయామని విపక్షాలు విమర్శలు చేశాయని, ఇప్పుడు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయని, అయినా విపక్షాలు ఓడిపోయాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. గ్యారెంటీగా చెబుతున్నా అంటూ యోగి వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని యోగి తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు అఖిలేష్ యాదవ్కు గట్టి ఎదురు దెబ్బ అని అన్నారు.
కాగా, 2016లో జరిగిన ఇవే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 60 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని ఎస్పీ ఆరోపణలు గుప్పించింది.