పౌరసత్వ చట్టం..’ ఐఏఎస్ ‘ కాబోయే కుర్రాడు హతం
సవరించిన పౌరసత్వ చట్టం ఓ అమాయక కుర్రాడిని బలి తీసుకుంది. ఐఏఎస్ కు ప్రిపేరవుతున్న సులేమాన్ అనే 20 ఏళ్ళ యువకుడు ప్రాణాలొదిలాడు. యూపీలోని బిజ్నూర్ లో శుక్రవారం జరిగిన పోలీసుల కాల్పుల్లో ఈ యువకుడు మరణించాడు. దీంతో.. ఆందోళనకారులపై తాము కాల్పులు జరుపుతున్నామని మొట్టమొదటిసారిగా పోలీసులు అంగీకరించారు. ఇప్పటివరకు తమ ఖాకీలు అసలు నిరసనకారులపై కాల్పులు జరపడంలేదని, ఆందోళనకారులే వారిలో వారు ఫైర్ చేసుకోవడంతో వారు మరణిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇది […]
సవరించిన పౌరసత్వ చట్టం ఓ అమాయక కుర్రాడిని బలి తీసుకుంది. ఐఏఎస్ కు ప్రిపేరవుతున్న సులేమాన్ అనే 20 ఏళ్ళ యువకుడు ప్రాణాలొదిలాడు. యూపీలోని బిజ్నూర్ లో శుక్రవారం జరిగిన పోలీసుల కాల్పుల్లో ఈ యువకుడు మరణించాడు. దీంతో.. ఆందోళనకారులపై తాము కాల్పులు జరుపుతున్నామని మొట్టమొదటిసారిగా పోలీసులు అంగీకరించారు. ఇప్పటివరకు తమ ఖాకీలు అసలు నిరసనకారులపై కాల్పులు జరపడంలేదని, ఆందోళనకారులే వారిలో వారు ఫైర్ చేసుకోవడంతో వారు మరణిస్తున్నారని పోలీసు అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇది తప్పని బిజ్నూర్ ఘటనతో తేలిపోయింది. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈ పట్టణంలో హింసకు దిగినవారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ గుంపులో ఒకరు ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని ఫైర్ చేశాడని, అయితే ఆ హెడ్ కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని యూపీ డీజీపీ తెలిపారు. ఆత్మరక్షణార్థం ఆ పోలీసు తిరిగి కాల్పులు జరపడంతో సులేమాన్ తీవ్రంగా గాయపడ్డాడని, అతని సహచరులు అతడిని తీసుకువెళ్తుండగా మరణించినట్టు తెలిసిందని ఆయన చెప్పారు. అటు- నిరసనకారుల కాల్పుల్లో అనీస్ అనే యువకుడు మృతి చెందాడు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆదివారం బిజ్నూర్ వెళ్లి.. సులేమాన్, అనీస్ ల కుటుంబాలను పరామర్శించారు. కాగా-తన సోదరుడు జ్వరంతో బాధ పడుతున్నాడని, శుక్రవారం నమాజ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. పోలీసులు మొదట లాఠీచార్జి చేసి.. కాల్పులు జరిపారని సులేమాన్ బ్రదర్ తెలిపాడు. ఐఏఎస్ సివిల్ సర్వీసులకు ప్రిపేరవుతున్న తన తమ్ముడిని పోలీసులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆయన వాపోయాడు. యూపీలో ఇప్పటివరకు పోలీసుల కాల్పుల్లో 18 మంది మృతి చెందారు.