Bihar Politics: అందుకే బీజేపీతో నితీశ్ కుమార్ తెగతెంపులు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్లో ఎన్డీయే సర్కారు నిట్టనిలువున కూలిపోయింది. బీజేపీతో జేడీయు తెగతెంపులు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా సమర్పించి.. ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాన చేరారు.
Bihar Political Crisis: బీహార్లో ఎన్డీయే సర్కారు నిట్టనిలువున కూలిపోయింది. బీజేపీతో జేడీయు తెగతెంపులు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా సమర్పించి.. ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాన చేరారు. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నితీశ్ కుమార్ చకచకా పావులు కదుపుతున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మద్ధతుతో నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడానికి దేశ ప్రధాని కావాలన్న నితీశ్ కుమార్ అత్యాశే కారణమంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. దేశ ప్రధాని కావాలన్న తన ఆశను నెరవేర్చుకునేందుకే నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. విపక్షాలతో చేతులు కలిపారని అన్నారు.
ఇలా రాత్రికి రాత్రే పొత్తులను మార్చడం నితీశ్ కుమార్కు అలవాటేనని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. గతంలో బీజేపీ, మహాకూటమితో ఈ రకంగానే పొత్తలు మార్చుకున్నారని.. ఇప్పుడు మరోసారి బీజేపీతో పొత్తును తెంచుకున్నారని అన్నారు. అదే సమయంలో బీహార్లో జేడీయుతో పొత్తు ఇక ఉండబోదన్న అంశంపై తాము చింతించడం లేదన్నారు. బీజేపీ సిద్ధంతాలకు తప్ప.. ఎవరికీ లొంగదని అన్నారు. కూటమి ధర్మాన్ని బీజేపీ పాటించలేదని ఎవరూ ప్రశ్నించలేరన్నారు.
కాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం ద్వారా నితీశ్ కుమార్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయు కలిసి అధికారంలోకి వచ్చాయని బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ గుర్తుచేశారు. నాటి ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలిచినా.. పెద్ద మనస్సుతో నితీశ్ కుమార్ను సీఎం చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం బీహార్ ప్రజలు, బీజేపీని వంచించడమేనని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..