అమరులైన జవాన్లకు హోంమంత్రి అమిత్ షా ఘన నివాళి.. మరికాసేపట్లో ఘటనాస్థలం పరిశీలన
నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ ఘనంగా నివాళ్లులర్పించారు.
amit shah tributes to security personnel: నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ ఘనంగా నివాళ్లులర్పించారు. జవాన్ల పార్థివదేహాల వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. కాగా, జగదల్పూర్లో 14 మంది అమర జవాన్ల మృతదేహాలను ఉంచారు.
అయితే, మావోయిస్టుల మెరుపుదాడిలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 24కు పెరిగింది. 31 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్ కూడా ఉన్నారు. వీరు కోబ్రా 210 దళంలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది జవాన్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన వారికోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Chhattisgarh: Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel who lost their lives in the Naxal attack, in Jagdalpur. https://t.co/vlDGKokhVe pic.twitter.com/MQjHOY0RIq
— ANI (@ANI) April 5, 2021
మరోవైపు, జవాన్లపై దాడి జరిగిన ప్రాంతాన్ని మరికాసేపట్లో అమిత్ షా పరిశీలించనున్నారు. బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దును పరిశీలించి, ఈ దారుణ ఘటనకు సంబంధించి సమీక్షించనున్నారు. అనంతరం ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్ షా పరామర్శించనున్నారు.
బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో డీఆర్జీ, స్పెషల్ టాస్క్ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల కోసం హిడ్మా నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) సిల్గేరీ అటవీ ప్రాంతంలో గుట్టలపై మాటు వేసింది. శనివారం మధ్యాహ్నం బలగాలు అక్కడికి రాగానే గెరిల్లా ఆర్మీ మెరుపు దాడి చేసింది. అటేు నక్సలైట్లలో కూడా 10 12 మంది చనిపోయి ఉంటారని సీఆర్పీఎఫ్ బలగాలు భావిస్తున్నాయి.
కాగా, సుక్మా జిల్లా కాల్పుల ఘటనతో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో హైఅలెర్ట్ ప్రకటించాయి. తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.