Maha Crisis: రంగంలోకి దిగిన ఉద్ధవ్ సతీమణి రష్మీ థాక్రే.. అసమ్మతి ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు..
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మహిళా నేతలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్ధవ్థాక్రేకు తోడుగా ఆయన భార్య రష్మీ రంగం లోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో ఆమె ఫోన్లో మాట్లాడుతున్నారు.
మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. రెబల్స్ను బుజ్జగించడానికి సీఎం ఉద్ధవ్థాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ థాక్రే . అసమ్మతి ఎమ్మెల్యేల భార్యలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. వారి భర్తల్ని ఎలాగైనా రాజీ చేయాలని ఆమె కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్ధవ్ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెరవెనుక రాజకీయాలు నడిపిన రష్మీ థాక్రే ఇప్పుడు నేరుగా రంగం లోకి దిగారు. వాస్తవానికి ఉద్ధవ్థాక్రేను సీఎం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కుమారుడు ఆదిత్యాథాక్రేకు కూడా కేబినెట్ పదవిని ఆమె పట్టుబట్టి సాధించారు. పార్టీ కేడర్తో ఆమెకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. అందుకే షిండే తిరుగుబాటు తరువాత కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. గౌహతిలో ఉన్న 40 మందికి పైగా శివసేన రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మీ థాక్రే ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
అయితే రష్మీ థాక్రే వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి. రెబల్స్ ఇంకా కొద్దిరోజులు గౌహతి లోనే ఉండాలని నిర్ణయించుకునట్టు సమాచారం. ఏక్నాథ్షిండే వర్గానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో మహావికాస్ అఘాడి సర్కార్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఈనెల 30 వరకు గౌహతి లోనే షిండే క్యాంప్ ఉండే అవకాశాలున్నాయి.
ఇక ఈ ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు.