Assam Floods: ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోన్న అసోం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..
Assam Floods: ప్రకృతి ప్రకోపానికి అసోం విలవిలలాడిపోతోంది. ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వానలు, వరదలకు కకావికలమైపోతోంది. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి భారీ వరదలు...
Assam Floods: ప్రకృతి ప్రకోపానికి అసోం విలవిలలాడిపోతోంది. ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వానలు, వరదలకు కకావికలమైపోతోంది. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి భారీ వరదలు. ఎటు చూసినా నీరే. ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి పలు ప్రాంతాలు. మోకాలి లోతు నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద విలయానికి 130మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల భారీగా పేరుకుపోయిన బురదలో స్థానికుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఇళ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ నీటమునిగిపోయాయి. దీంతో ఆహారం, తాగునీరు అందించేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సిల్చార్లో ఐతే అత్యంత ధయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
150 పడకల క్యాచర్ క్యాన్సర్ ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్ కూడా నీటమునిగిపోయింది. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. గదులన్నీ మునిగిపోవడంతో రోగులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. అతి కష్టంమీద ఎమర్జెన్సీ ఆపరేషన్స్ మాత్రమే చేస్తున్నారు. ఆస్పత్రిలోని సిబ్బందిని, రోగులను తరలించేందుకు ఆస్పత్రి నిర్వాహకులు లైఫ్ జాకెట్లు, బోట్లు కావాలని కోరారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నీళ్లు లేని చోటకు రోగులను తీసుకెళ్లి కీమో థెరపీ చేస్తున్నారు సిబ్బంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. వరదలతో అల్లాడుతున్న అసోంలో సైన్యం చేస్తున్న సహాయక చర్యలకు జనం హ్యాట్సాఫ్ అంటున్నారు. సిల్చార్లోని మాలినీబీల్ ప్రాంతంలో వరదనీటిలోనే వైద్యసాయం చేపడుతున్నారు. ప్రాణాంతక రోగులకు సైతం వైద్యసాయం అందిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..