కమల్ నాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు.. రేపు విచారణ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు.. సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి, స్పీకర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి, గవర్నర్ లాల్ జీ టాండన్ కు సైతం నోటీసులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు.. సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి, స్పీకర్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి, గవర్నర్ లాల్ జీ టాండన్ కు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం లాయర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహ్తగీ తీవ్రంగా స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కావాలనే వారు కోర్టుకు హాజరు కాలేదన్నారు. అటు-తనకు తగినంతమంది ఎమ్మెల్యేల బలం ఉందని, సభలో ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కొనేందుకు తాను సిధ్ధమేనని కమల్ నాథ్ ఇదివరకే ప్రకటించారు. ఇలా ఉండగా.. బెంగుళూరులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ భోపాల్ వెళ్లి, సభలో జరిగే కమల్ నాథ్ ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొంటారా లేదా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది. బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా తీసుకునే నిర్ణయం పైనే తమ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ఎలాగైనా కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ సీఎం పీఠం ఎక్కేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో ఆయన జ్యోతిరాదిత్య సహాయాన్ని ఆశిస్తున్నారు. తనకు మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో వారిని సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తే న్యాయపరంగా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సింధియా, చౌహాన్ ఇద్దరూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో ఇంకా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.