కాంత ప్రసాద్ మొహంలో కాంతిని నింపిన సోషల్ మీడియా!
ఢిల్లీలోని మాలవీయనగర్లో ఓ చిన్ని దాబా ఉంది.. దాని పేరు బాబాకా దాబా! కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ప్రభావం ఆ దాబా మీద పడింది.. పాపం దాబా యజమాని కాంత ప్రసాద్ పూర్తిగా కుంగిపోయాడు..
ఢిల్లీలోని మాలవీయనగర్లో ఓ చిన్ని దాబా ఉంది.. దాని పేరు బాబాకా దాబా! కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ప్రభావం ఆ దాబా మీద పడింది.. పాపం దాబా యజమాని కాంత ప్రసాద్ పూర్తిగా కుంగిపోయాడు.. 80 ఏళ్ల ఆ పెద్దమనిషికి ఆ దాబానే ఆధారం.. దాన్నుంచి వచ్చే ఆదాయంతో తను, తన భార్య బాదామి దేవి జీవితాన్ని నెట్టుకొచ్చేవారు.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు.. పని చేసే శక్తి లేదు.. ఏం చేయాలిరా భగవంతుడా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడా పెద్దాయన! వృద్ధుడు కంటతడి పెట్టుకుంటున్న ఆ దృశ్యాలను కెమెరాలో బంధించిన ఒకరు ట్విట్టర్లో పోస్టు చేశాడు.. ముదిమి వయసులో ఆ వృద్ధదంపతులు పడుతున్న అగచాట్లు అందరినీ కదిలించాయి.. ఎవరైనా వీరిని ఆదుకోవాలనే విజ్ఞప్తి కూడా చేశాడు ఆ ట్విట్టర్లో … అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.. కడుపు చించుకుపుట్టినవారు ఉన్నా .. పట్టించుకోని దురదృష్టవంతులు వీరు! ఈ వృద్ధ దంపతుల పోరాట స్ఫూర్తి ఎందరినో కదిలించింది.. బాలీవుడ్ స్టార్స్ సునీల్షెట్టి, రవీనాటాండన్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్లే కాదు, క్రికెట్ ఆటగాడు అశ్విన్ కూడా ఈ వీడియోనే లైక్ చేసి షేర్ చేశారు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అయితే దాబాను సందర్శించి కడుపు నిండా తిని వెళ్లారు. నెటిజన్ల నుంచి కూడా వీపరీతమైన స్పందన వచ్చింది.. ఇక అంతే… బాబా దాబాకు జనం క్యూలు కట్టడం మొదలయ్యింది.. అందులో దొరికే భోజనం, చపాతీలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చేసింది.. బయటవారు కూడా ఆర్డర్లు ఇవ్వసాగారు.. కాంత ప్రసాద్ స్వయంగా చేసిన మటన్ పనీర్ను ఇష్టంగా తిన్నారు.. ఆయనతో సెల్ఫీలు దిగారు.. యజమాని మొహంలో ఆనందం వెల్లివెరిసింది.. ఇప్పుడు మాలవీయనగర్లో ఉన్న బాబాకా దాబా ఓ ల్యాండ్ మార్క్గా మారింది.. ఇప్పుడు కాంత ప్రసాద్కు తీరిక దొరకడం లేదు.. దాబాకు వచ్చే కస్టమర్లతో బిజీ అయ్యారు..