Supreme Court: అప్పుడు అల్లుడికి అత్తే చట్టబద్ధ ప్రతినిధి.. అతని సొమ్ముపై ఆమెకూ హక్కుంటుంది.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆస్తి వ్యవహారాలకు సంబంధించి చాలా ఇళ్లల్లో అత్తా-అల్లుళ్ల మధ్య తగాదాలు....
ఆస్తి వ్యవహారాలకు సంబంధించి చాలా ఇళ్లల్లో అత్తా-అల్లుళ్ల మధ్య తగాదాలు, గొడవలు జరగడం సహజమే. కొన్ని సందర్భాల్లో తీవ్ర రూపం కూడా దాల్చి కోర్టు కేసుల దాకా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్తా-అల్లుళ్ల ఆస్తి వ్యవహారాలు, పరిహారాలకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. కూతురుతో కలిసి అల్లుడి ఇంట్లో నివసిస్తోన్న అత్త అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం అతనికి లభించే పరిహారం పొందడానికి ఆమె అన్ని విధాలా అర్హురాలేనంటూ పేర్కొంది. ఈమేరకు జస్టిస్ ఎస్ ఏ నజీర్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం తీర్పు ప్రకటించింది. దీంతో పాటు అత్తా-అల్లుళ్ల వ్యవహారంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె కూడా పరిహారం పొందవచ్చు … ‘వృద్ధాప్యం లేదా ఇతర సమస్యల కారణంగా కూతురు- అల్లుడితో కలిసి అత్తలు జీవించడం మన భారతీయ సమాజంలో భాగమే. ఇక కొద్ది మంది ముసలితనంలో పోషణ నిమిత్తం పూర్తిగా అల్లుడిపైనే ఆధారపడుతుంటారు. అంతమాత్రాన అల్లునికి అత్త చట్టబద్ధమైన ప్రతినిధి వారసురాలని చెప్పలేం…అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అత్త కచ్చితంగా అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతారు. ప్రధానంగా ఏదైనా ప్రమాదంలో అల్లుడు మరణించినప్పుడు అత్త కచ్చితంగా చట్టబద్ధ ప్రతినిధి అవుతారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్-166 ప్రకారం బీమా పరిహారం పొందేందుకు ఆమె అన్ని విధాలా అర్హురాలు అవుతుంది’ అని సుప్రీం వ్యాఖ్యానించింది. కేసు వివరాలేంటంటే.. కేరళకు చెందిన వేణుగోపాలన్ నాయర్ అనే ప్రొఫెసర్ 2011లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పరిహారం కింద ప్రొఫెసర్ కుటుంబానికి రూ.74, 50, 971లు చెల్లించాలి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే సదరు బీమా కంపెనీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు మెట్లెక్కింది. దీనిపై విచారణ జరిపిన కేరళ అత్యున్నత న్యాయస్థానం పరిహారం మొత్తాన్ని రూ.48, 39, 728కి తగ్గించింది. దీంతో పాటు అత్తను అల్లునికి చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని తీర్పు ఇచ్చింది. దీంతో మృతుడి భార్య సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ‘మృతుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నెలకు రూ.81వేలకు పైగా సంపాదించేవాడు. అయితే అతను 52 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. బీమా కంపెనీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని తీర్పు ప్రకటించింది. అదేవిధంగా అల్లుడికి అత్త చట్టబద్ధ ప్రతినిధి కాదంటూ, బీమా డబ్బులు పొందేందుకు ఆమె అర్హురాలు కాదంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
Also Read: PM Modi: ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి.. ఈ ఘనత మనందరిది : మోదీ (వీడియో)
PM Modi: కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు.. కోలుకుంటున్న సమయంలో మళ్ళీ వస్తుంది : మోదీ (వీడియో)