Rahul Gandhi: ట్విట్టర్లో మాత్రమే రాహుల్ గాంధీ యాక్టివ్.. కాంగ్రెస్ను టార్గెట్ చేసిన శివసేన
Congress Vs Shiv Sena: మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో అంతా సవ్యంగా లేదన్న విషయం మరోసారి తేలిపోయింది. అక్కడ అధికారాన్ని పంచుకుంటున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి.
మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో అంతా సవ్యంగా లేదన్న విషయం మరోసారి తేలిపోయింది. అక్కడ అధికారాన్ని పంచుకుంటున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో మంగళవారంనాడు ప్రతిపక్ష నేతల సమావేశాన్ని నిర్వహించడం తెలిసిందే. ఈ సమావేశంలో కాంగ్రెస్, శివసేన పార్టీల నేతలు ఎవరూ పాల్గొనలేదు. భావసారూప్య పార్టీలు, నేతలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కొందరు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించినా ఎవరూ రాలేదని కేంద్ర మాజీ మంత్రి యస్వంత్ సిన్హ మీడియాకు తెలిపారు. జాతీయ స్థాయిలో మోడీ సర్కారును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక(థర్డ్ ఫ్రంట్)ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగానే శరద్ పవార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. శరద్ పవార్ ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి తృణాముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, వామపక్ష పార్టీలు సహా 8 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి గైర్హాజరు కావడం ద్వారా శరద్ పవార్కు తమ మద్ధతు లేదని కాంగ్రెస్ అధిష్టానం చెప్పకనే చెప్పింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని నేరుగా టార్గెట్ చేస్తూ శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్ అంటూ పార్టీ అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. మోడీ ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలపై బాగానే విమర్శలు చేస్తున్నారని…అయితే ఆయన ట్విట్టర్కు మాత్రమే పరిమితమవుతున్నారని పేర్కొంది. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ విఫలం చెందారని తమ పత్రికలో రాసుకొచ్చింది.
అదే సమయంలో శరద్ పవార్ను పొగడ్తలతో ముంచెత్తింది శివసేన. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు శరద్ పవార్ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపింది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు శరద్ పవార్ చేస్తున్న ప్రయత్నాలకు రాహుల్ గాంధీ మద్ధతు ఇవ్వాలని సూచించింది.
దేశంలో ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు పేర్కొన్న శివసేన…ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చేయిదాటి పోతోందన్న విషయం ప్రధాని మోడీకి కూడా తెలుసని వ్యాఖ్యానించింది. ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి నెలకొన్నా..తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బీజేపీ గట్టిగా నమ్ముతోందని, బలహీన ప్రతిపక్షమే దీనికి కారణమని సామ్నాలో అభిప్రాయపడింది. శరద్ పవార్లా రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి ఉంటే బాగుండేదని పేర్కొంది.
రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ శివసేన చేసిన వ్యాఖ్యల పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఉండబోదన్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రకటనతో ఆ రెండు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని విమర్శిస్తూ శివసేన వ్యాఖ్యలు చేయడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.
Also Read..
తెలంగాణ మంత్రి ప్రశాంత్రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు
‘మోదీ’ ఇంటిపేరుపై ‘వివాదం’… నేనలా అనలేదు.. సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…