Kerala: నరబలి కేసులో సంచలన విషయాలు.. వివాహేతర సంబంధమే కారణమా.. మరేదైనా ఉందా..
కేరళ నరబలి కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కేరళ పథనంతిట్ట జిల్లా ఎలంతూర్ లో జరిగిన నరబలి కేసులో కొత్త ట్విస్టు బయట పడింది. ఈ కేసులో..
కేరళ నరబలి కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కేరళ పథనంతిట్ట జిల్లా ఎలంతూర్ లో జరిగిన నరబలి కేసులో కొత్త ట్విస్టు బయట పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంత్రికుడు షఫి అలియాస్ రషీద్ టార్గెట్ లైలా భర్త భగవల్ సింగ్ అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భగవల్ సింగ్ ను హతమార్చి లైలాతో కలసి జీవించేందుకే రషీద్ ఈ పన్నాగం పన్ని ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో వివాహేతర సంబంధం కోణంలోనూ విచారణ సాగుతోంది. పద్మ, రోస్లిన్ లను హతమార్చడంతో పాటు వారి శరీర భాగాలను వండుకు తిన్నారన్న వార్తతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది కేరళ. పద్మ, రోస్లిన్ లను సింగ్ నివాసానికి తెచ్చి, వారిని బలి ఇచ్చాక వారి శరీర భాగాల్లో కొన్నింటిని ఈ ముగ్గురూ వండుకు తిన్నట్టు పోలీసులు గుర్తించారు.
పద్మ డెడ్ బాడీని ఐదు ముక్కలు, రోస్లిన్ డెడ్ బాడీని 56 ముక్కలుగా చేసినట్టు తెలుస్తోంది. అక్షరాస్యులు అధికంగా ఉన్న రాష్ట్రం. అభ్యుదయభావాలు అధికమన్న పేరుండీ.. ఇలాంటి ఘటనల జరగడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఏవన్ రషీద్, ఏటూ భగవల్ సింగ్, సింగ్ భార్య లైలా ఏత్రీగా ఉన్నారు. సీసీ ఫుటేజీ, సెల్ టవర్ లొకేషన్ల సాయంతో నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందర్ని నరబలి ఇవ్వాలని నిందితులు ఆలోచిస్తున్నట్టు పోలీసు విచారణలో బయట పడింది.
నరబలి ఇస్తే ఆర్ధికంగా బలపడతామని మాంత్రికుడు రషీద్ చెప్పిన మాటలు నమ్మి తామీ నేరానికి ఒప్పుకున్నామని పోలీసులతో చెప్పారు సింగ్- లైలా దంపతులు. ఇప్పటికే ఒక హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రషీద్. ఒక మహిళను తీవ్రంగా గాయపరిచిన కేసులో గతేడాదే బెయిలుపై విడుదలయ్యాడంటున్నాయి పోలీసు రికార్డులు. చదివింది ఆరో తరగతైనా.. నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేయడం ఇతడికి అలవాటేనని గుర్తించారు.. శ్రీదేవి అనే ఫేక్ అకౌంట్ తోనే ఇతడు భగవల్ సింగ్ ను బుట్టలో వేసుకున్నాడనీ.. చెబుతున్నారు పోలీసులు.
2018 నుంచీ ఇతడితో సింగ్ కి పరిచయం ఏర్పడిందనీ, ఈ పరిచయంతోనే రషీద్ సింగ్ భార్య లైలాపై కన్నేశాడనీ. నరబలి పేరిట సింగ్ ను కూడా బలి ఇచ్చి, ఆమెతో సహజీవనం చేయాలనుకున్నాడనీ భావిస్తున్నారు పోలీసులు. ఈ నరబలి వెనక ఇంకెలాంటి ఉద్దేశాలున్నాయో ఆరా తీస్తున్నారు. ఇంకెవరైనా బాధితులున్నారా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. ముగ్గురు నిందితులనూ రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు వీరిని రిమాండ్ కు తరలించారు.