Maharashtra: టిక్టాక్ స్టార్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నేతకు మంత్రిపదవి.. మహా సర్కార్పై విమర్శలు..
Maharashtra Cabinet: మహారాష్ట్ర సీఎం షిండే కేబినెట్ను విస్తరించారు. 18 మందికి మంత్రిపదవులు దక్కాయి. టిక్టాక్ స్టార్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాథోడ్కు మంత్రిపదవి దక్కడంపై విమర్శలు వెలువెత్తాయి.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో షిండే మంత్రివర్గం కొలువుదీరింది. తొమ్మిది మంది బీజేపీ నేతలకూ, గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలోని శివసేన మంత్రులు 8 మందికీ, షిండే మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యే తానాజి సావంత్ని సైతం పదవి వరించింది. మొత్తం 18 మంది మినిస్టర్స్ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 17 మంది మాజీ మంత్రులే. షిండే కేబినెట్లో శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలే తప్పుబడుతున్నారు. టిక్టాక్ స్టార్ పూజ చౌహాన్ హత్య కేసులో రాథోడ్ నిందితుడిగా ఉన్న రాథోడ్కు మంత్రిపదవి ఎలా ఇస్తారంటూ బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘ్ ప్రశ్నించారు. ఆయనపై తాము న్యాయపోరాటం చేస్తామనీ, ఆ పోరాటంలో విజయం సాధిస్తామని చిత్రా వాఘ్ చెప్పారు. నేరచరితుడికి ఇలా మంత్రిపదవి ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
సీఎం ఏక్నాథ్షిండేకు సంజయ్ రాథోడ్ అత్యంత సన్నిహితుడు. ఆయన్ను మంత్రిపదవి నుంచి తొలగించాలని గతంతో బీజేపీ నేతలు భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. మళ్లీ ఆయనకు మంత్రి పదవి ఎలా ఇస్తారని శివసేన ఉద్ధవ్ వర్గం ప్రశ్నించింది. ఇది చిన్నసైజ్ మంత్రివర్గ విస్తరణ మాత్రమే అని అన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. త్వరలోనే భారీ స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. సీఎంగా షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేసిన 40 రోజుల తరువాత మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ జరిగింది. ఇద్దరు మాత్రమే అన్ని పదవులు అనుభవిస్తున్నారని మంత్రివర్గ విస్తరణపై విపక్షాల నుంచి విమర్శలు రావడంతో చివరకు కేబినెట్ను విస్తరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం