Bihar: ఎస్బీఐలో భారీ చోరీ..పని చేసే బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు..ఏకంగా 2.8కేజీల బంగారం లూటీ
దొంగలు రెచ్చిపోతున్నారు. గుడి, బడి అనే తేడా లేదు. అదును దొరికితే చాలు..ఎక్కడైనా చోరీ చేసేస్తున్నారు. తాజాగా ఎస్బీఐ బ్యాంక్ లాకర్ నుంచి 2.8 కేజీల బంగారాన్ని అధికారుల కళ్లు గప్పి స్వాహా చేశారు కేటుగాళ్లు.
దేశంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గుడి, బడి అనే తేడా లేదు. అదును దొరికితే చాలు..ఎక్కడైనా చోరీ చేసేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకులు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల్లోనూ దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎస్బీఐ బ్యాంక్ లాకర్ నుంచి 2.8 కేజీల బంగారాన్ని అధికారుల కళ్లు గప్పి స్వాహా చేశారు కేటుగాళ్లు. మాయం చేసిన గోల్డ్ విలువు రూ. 1.25కోట్లుగా ఉంటుందని అధికారులు అంచాన వేశారు. కేసు సీరియస్గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం విస్తృతంగా వేట సాగించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్, అకౌంటెంట్లను సస్పెండ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీహార్లో జరిగిన ఈ భారీ చోరీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్లోని సహర్సకు చెందిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా( (SBI)లో ఏప్రిల్ 23న భారీ చోరీ జరిగింది. కానీ, ఈ దొంగతనం విషయం మాత్రం మే 9న వెలుగులోకి వచ్చింది. దాంతో వెంటనే అప్రమత్తమైన బ్రాంచ్ మేనేజర్ లలిత్ కుమర్ సిన్హా మే 10న బైజ్నాథ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దోపిడీ ఘటనపై విస్తృత దర్యాప్తు సాగించారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకులోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా మాలిక్, ఉమేష్ అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసినట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు అదే బ్యాంకులో కాంట్రాక్ట్ఉద్యోగులుగా నిర్ధారించారు. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని నేపాల్లో విక్రయించినట్టుగా తేల్చారు. కాకపోతే, బ్యాంక్ లాకర్ తాళాలు కాంట్రాక్టు ఉద్యోగికి ఎలా అందజేశారో ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారింది. దీంతో క్యాషియర్ ప్రత్యూష్ కుమార్, అకౌంటెంట్ అశోక్ ఓరాన్ ను బ్యాంక్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, చోరీ చేసిన బంగారం మొత్తం రికవరీ చేయిస్తామని చెప్పారు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ బికె సింగ్. బంగారం దొరకని పక్షంలో దానికి తగిన నగదు చెల్లింపులు చేస్తామని కస్టమర్లకు హామీ ఇచ్చారు. మరోవైపు ఆ ప్రాంతంలోని కొందరు నగల వ్యాపారులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.