B S Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఊరట.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుపై స్టే మంజూరు
Karnataka CM BS Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనపై వెల్లువెత్తిన అవినీతి...
Karnataka CM BS Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం స్టే జారీ చేసింది. పదేళ్ల కిందట ఓ కేసులో యడియూరప్ప తరపున న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు… స్టే మంజూరు చేసింది. 24 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలను బీఎస్ యడియూరప్ప ఎదుర్కొంటున్నారు. దీనిని సవాల్ చేస్తూ యడియూరప్ప ముందుగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ప్రొసిడింగ్స్ను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగింది.
ఈ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసేలా కర్ణాటక హైకోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. యడియూరప్పపై లోకాయుక్త నమోదు చేసిన కేసు విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని కర్ణాటక హైకోర్టు కొన్ని రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును యడియూరప్ప సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గత నెల 21న పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేయాలని కోరారు.
అయితే ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. యడియూరప్ప తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ తన వాదనలు వినిపించారు. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం సక్రమమేనంటూ వాదనలు వినిపించారు. ఇలా వాదోపవదాలను విన్న సుప్రీం కోర్టు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంపై స్టే మంజూరు చేసింది. దీంతో సీఎం యడియూరప్పకు ఊరట లభించినట్లయింది.
ఇవీ చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ విచారణ.. కీలక ఆదేశాలు జారీ చేసిన బాంబే హైకోర్టు