Farmers Tractor March: పార్లమెంట్కు రైతుల ట్రాక్టర్ మార్చ్.. ఇవాళ కీలక భేటీలో తుది నిర్ణయం.. మళ్లీ ఎందుకంటే!
వివాదాస్పదమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా అన్నదాతలు శాంతించడంలేదు.
Farmers Protest: వివాదాస్పదమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా అన్నదాతలు శాంతించడంలేదు. కొత్త చట్టాలను పూర్తిస్థాయిలో ఉపసంహారించుకునేంత వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల ఐక్య కిసాన్ మోర్చా తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్ ఉపసంహరణపై రైతు సంఘాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ కు ట్రాక్టర్ మార్చ్ ఆందోళన కొనసాగించాలా వద్దా అన్నది ఆదివారం రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయిస్తామని రైతు సంఘాల ఐక్య కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రతినిధులు తెలిపారు. ఆందోళనలకు సంబంధించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకులు శనివారం తెలిపారు
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలకు ఏడాది కాలం పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 29 నుండి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలలో ప్రతిరోజూ 500 మంది రైతులు పార్లమెంటుకు శాంతియుత ట్రాక్టర్ మార్చ్లో పాల్గొంటారని SKM కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. కనీస మద్దతు ధర (MSP) చట్టబద్ధమైన హామీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగుతుందని సూచించింది. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రధానమంత్రి ప్రకటన పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే వరకు పోరాడాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
రైతు నాయకుడు, SKM కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం మాట్లాడుతూ, ‘పార్లమెంటు వరకు ట్రాక్టర్ మార్చ్ కోసం మా పిలుపు ఇప్పటికీ చెల్లుతుంది. ఆదివారం నాడు సింగు సరిహద్దులో జరిగే SKM సమావేశంలో రైతు ఉద్యమం భవిష్యత్తు, MSP సమస్యలపై తుది నిర్ణయం తీసుకుంటామని, ట్రాక్టర్ మార్చ్ నిర్ణయాన్ని ఇంకా ఉపసంహరించుకోలేదని కిసాన్ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్ తిక్రీ సరిహద్దులో తెలిపారు.
‘పార్లమెంటుకు ట్రాక్టర్ ట్రాలీ మార్చ్పై SKM నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. SKM కోర్ కమిటీ సమావేశం తర్వాత ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది” అని చెప్పారు. ఇదిలావుంటే, జనవరి 26న, రాజధానిలో ఒక ట్రాక్టర్ ర్యాలీ ఎర్రకోటలోకి ప్రవేశించి అక్కడ మత జెండాను నిరసనకారులు ఎగురవేయడం హింసాత్మకంగా మారింది.
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ చట్టాలను రద్దు చేసే వరకు రైతులు ఢిల్లీలోని టిక్రి, ఇతర సరిహద్దుల్లో కూర్చొని ఉంటారని ఉగ్రహన్ అన్నారు. శుక్రవారం ప్రధాని ప్రకటన అనంతరం పలు రైతు సంఘాలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వ్యవసాయం, భవిష్యత్తు వ్యూహంపై చర్చిస్తున్నాయి. ఎస్కేఎం సమావేశంలో ఈ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు ఎంఎస్పీ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టిక్రీ సరిహద్దులో ఉన్న మరో రైతు నాయకుడు, SKM సభ్యుడు సుదేష్ గోయట్ మాట్లాడుతూ, “రైతులు వ్యవసాయ చట్టాలపై కేంద్రాన్ని విశ్వసించలేరు ఎందుకంటే వారు ఇంతకుముందు కూడా ఒక ర్యాంక్-వన్ పెన్షన్ను ప్రకటించారు. కానీ ఇంకా ఇవ్వలేదు. అందుకే ఈ చట్టాలను పార్లమెంట్లో అధికారికంగా ఉపసంహరించుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పాం. ఉద్యమం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. ట్రాక్టర్ మార్చ్ రద్దుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోయత్ తెలిపారు.
Read Also… కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో