బీహార్, సెప్టెంబర్ 27: పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో బీహార్కు చెందిన ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డ ఉదంతం బీహార్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. బీహార్కు చెందిన ఇద్దరు యువకులు స్టాఫ్ సెలక్షన్ పరీక్షకు హాజరయ్యేందుకు సిలిగురికి వెళ్లారు. అక్కడి స్థానికులు విద్యార్థులపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు బీహారీ యువకులను కొట్టడం, వారి చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పమనడం, వారితో గుంజీలు తీయించడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిని రజత్ భట్టాచార్య, గిరిధారి రాయ్గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ ‘బంగ్లా పఖో’ అనే సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎస్సీ పరీక్ష రాసేందుకు బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు నకిలీ సర్టిఫికెట్లతో వచ్చి బెంగాలీల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని రజత్ ఆరోపించారు. బెంగాల్లో ఒక రాకెట్ పనిచేస్తోందని, ఇది యువతకు నకిలీ నివాస ధృవీకరణ పత్రాలను ఇస్తుందని, తద్వారా బయటివారికి రాష్ట్రంలో ఉద్యోగాలు లభిస్తున్నట్లు బంగ్లా పాఖో జనరల్ సెక్రటరీ గార్గా ఛటర్జీ ఆరోపించారు. అయితే, ఈ మొత్తం విషయం వెలుగులోకి రావడంతో, బీహార్లో ‘డొమిసైల్ పాలసీ’ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది చాలా కాలంగా బీహార్లో పెద్ద సమస్యగా మారింది. డొమిసైల్ పాలసీ లేకపోవడంతో బీహార్ యువత రాష్ట్రంలో ఉద్యోగాలు పొందలేక వలసలు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
నిజానికి, దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్థానికత విధానం అమలులో ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగాలకు రాష్ట్రంలోని స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అయితే గతంలో బీహార్లో కూడా ఈ విధానం ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల అక్కడి సర్కార్ దీనిని రద్దు చేసింది. గతంలో బీహార్లో ఉపాధ్యాయ నియామకాల్లో స్థానికత విధానం లేదు. టీచర్ రిక్రూట్మెంట్ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే 2020 డిసెంబర్లో నితీష్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల్లో స్థానికత విధానాన్ని అమలు చేసింది. అప్పటి నుంచి టీచర్ రిక్రూట్మెంట్లో స్థానికులకే ఉద్యోగాలు వచ్చేవి. అయితే ఈ విధానానికి జూలై 2023లో అక్కడి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో గణితం, సైన్స్ బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో లేనందున ఈ విధానానికి స్వస్తి పలికినట్లు ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ నియామకాలకు ఇతర రాష్ట్రాల అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకుని, ఉద్యోగాలు పొందేందుకు వీలుకలిగింది.
पश्चिम बंगाल में बिहारी छात्रों से बर्बरतापूर्ण मारपीट की खबर बेहद दुर्भाग्यपूर्ण और निंदनीय है। वहां की मुख्यमंत्री ने फिर एक बार बिहारियों का अपमान किया है, जिसे कतई बर्दाश्त नहीं किया जा सकता। मैं ममता बनर्जी जी से पूछना चाहता हूं कि क्या पश्चिम बंगाल में परीक्षा देना भी गुनाह… pic.twitter.com/r63phJkbcr
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 26, 2024
రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడినైనా అతని/ఆమె పుట్టుక, కులం, మతం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపరాదని, వారికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించలేమని అప్పట్లో బీహార్ చీఫ్ సెక్రటరీ అమీర్ సుభానీ అన్నారు. కాగా 2020 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉపాధ్యాయ నియామకాల్లో స్థానికత విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలు చేసినా రెండున్నరేళ్లలోనే దీనిని మళ్లీ రద్దు చేశారు. నితీష్ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు సృష్టిస్తుందో ప్రజలు గమనించాలని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పాట్నాలో స్థానికత వివాదాన్ని లేవనెత్తారు. వలసలను ఆపేందుకు, నిరుద్యోగ సంక్షోభాన్ని అధిగమించేందుకు స్థానికత పాలసీ అవసరమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే డొమిసైల్ విధానాన్ని అమలు చేస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించారు కూడా. అయితే, డొమిసైల్ విధానాన్ని (స్థానికత) రద్దు చేసినప్పుడు, RJD కూడా ప్రభుత్వంతో ఏకీభవించింది.
పశ్చిమ బెంగాల్లో ఇద్దరు బీహారీ యువకులను కొట్టిన ఆరోపణ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, స్థానికత విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. నివాస విధానం తొలగించినప్పుడు, ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉదహరించింది. అయితే మధ్యప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, అరుణాచల్ వంటి అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలకు డొమిసైల్ విధానం అమలు చేస్తున్నారు. ఈక్రమంలో వలసలు, నిరుద్యోగం బీహార్లో పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం బీహార్లోని స్థానిక ఉద్యోగాలను కాపాడేందుకు డొమిసైల్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. వచ్చే ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటువంటి పరిస్థితిలో స్థానికత వివాదం ఆ రాష్ట్ర ఎన్నికల్లో ప్రతి పక్షాలకు ప్రధాన అస్త్రంగా ప్రచారం చేసుకునేందుకు అవకాశం లేకపోలేదు.