Dantewada Encounter: దంతేవాడ జిల్లాలో ఎన్కౌంటర్.. మళ్లీ రక్తమోడిన అడవితల్లి
ఇదో విషాదకర వార్త. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మళ్లీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Maoists killed: ఇదో విషాదకర వార్త. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మళ్లీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పర్సపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోల్ కాల్, పెదాపాల్ అటవీప్రాంతంలో తుపాకీ కాల్పులు జరిగాయి. భైరాం ఘడ్ ఏరియా కమిటీ మావోయిస్టులకు, డీఆర్జీ పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అసువులుబాశారు. ఈ క్రమంలో మావోలకు చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.
ఇలాఉండగా, ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు మావోయిస్టులు “మిలీషియా ప్లాటూన్ కమాండర్” బిర్జు, మావోయిస్టుల “రేంజ్ పార్టీ కమిటీ” డిప్యూటీ చీఫ్ జగ్గు అని తెలుస్తోంది. వీరి తలపై ఒక్కొక్కరికి లక్ష రూపాయల రివార్డు ఉంది. ఇలా ఉండగా, మూడు రోజుల క్రితమే, ఛత్తీస్గడ్లోని అటవీ ప్రాంతం నెత్తురోడింది. రాష్ట్రంలోని బీజాపూర్లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో.. కేంద్ర బలగాలు ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లపై పక్కా సమాచారం వచ్చిందని దీంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. బలగాల రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు.