ఇర్ఫాన్ మృతిపై మోదీ ట్వీట్…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) ఆకస్మిక మృతి అందరిని షాక్కి గురి చేసింది. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) ఆకస్మిక మృతి అందరిని షాక్కి గురి చేసింది. కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఆయన ఈ రోజు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఇర్ఫాన్ మృతి సినీ పరిశ్రమనే కాక రాజకీయ ప్రముఖులని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నటనా రంగంలో అసమాన ప్రతిభను కనపరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని .. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
మరోవైపు ఇర్ఫాన్ మృతిపై అమిత్ షా స్పందించారు. ఇర్ఫాన్ మరణవార్త తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ఇర్ఫాన్ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇర్ఫాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో కాల్లో వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. తల్లి చనిపోయిన నాలుగు రోజులకే ఇర్ఫాన్ ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత అవుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్ ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధించారు.