సింధియాతోనే మేం.. ఆరుగురు మాజీ మంత్రుల క్లారిటీ.. రిలీజైన వీడియో
ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఆరుగురు మంత్రులూ.. రాజీనామా తాము తీసుకున్న సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఆరుగురు మంత్రులూ.. రాజీనామా తాము తీసుకున్న సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదన్నారు. ఈ మేరకు ఎవరికి వారు విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. సింధియా ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే ఇవి విడుదలై వైరల్ అయ్యాయి. తులసీ శిలావత్, గోవింద్ రాజ్ సింగ్ పుత్, మహేంద్ర సింగ్ శిశోడియా, ఇమార్తి దేవి, ప్రభురాం చౌదరి, ప్రద్యుమ్న సింగ్ తోమర్ అనే ఈ ఆరుగురూ తాము కమల్ నాథ్ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నామని వఛ్చిన వార్తలను తోసిపుచ్చారు. (సింధియా శిబిరంలోని మంత్రుల చేత మోసపూరితంగా రాజీనామాలు చేయించారని, బెంగుళూరులో ఉన్న వీరు తమ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారని కమల్ నాథ్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే).
కానీ ఈ ప్రకటనను ఖండించిన ఈ మాజీ మంత్రులు.. తమతో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు తమతో బాటు కలిసికట్టుగా ఉన్నారని, ఎవరి ఒత్తిడీ వీరిపై లేదని ఆరోగ్య శాఖ మంత్రి తులసీ శిలావత్ తన వీడియోలో స్పష్టం చేశారు. మేమంతా జ్యోతిరాదిత్య సింధియా అడుగుజాడల్లో నడుస్తాం.. ఆయన నిర్ణయం మాకు శిరోధార్యం అన్నారు. అలాగే మహేంద్ర సింగ్ శిశోడియా.. నిజానికి సింధియా ఎవరికీ ద్రోహం చేయలేదని, ఆయనకే కాంగ్రెస్ పార్టీతో బాటు కమల్ నాథ్ కూడా ద్రోహం చేశారని అన్నారు. సింధియా కృషి వల్లే 15 ఏళ్ళ అనంతరం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఇతర మాజీ మంత్రులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలతో తమ వీడియోలను విడుదల చేశారు.
కాగా ఈ ఆరుగురితో సహా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో ఉండగా..ఇతరులు వివిధ చోట్ల ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేశారు.