Viral: జైల్లో ఉన్న కుమారుడ్ని కలిసేందుకు వెళ్లిన తల్లి.. ఆమె తెచ్చిన ఓ బాక్స్ చెక్ చేసి అధికారుల మైండ్ బ్లాంక్
కొడుకును చూసేందుకు పర్వీన్ రెగ్యులర్గా జైలుకు వచ్చేది. అయితే జూన్ 13న పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన ఆమె.. ఆ సమయంలో ఓ బాక్సుతోపాటు బట్టల బ్యాగ్ను తెచ్చింది.
కొడుకు ట్రాక్ తప్పాడు… పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. ప్రజంట్ చిప్ప కూడు తింటున్నాడు. అయితే అతడిని కలిసి పద్దతి మార్చుకోమని చెప్పాల్సిన తల్లి.. తానే కటకటాల్లోకి వెళ్లే పని చేసింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. కర్ణాటక(Karnataka)లో మహమ్మద్ బిలాల్పై 11 దోపిడీ కేసులు ఉన్నాయి. ఇటీవలే కోననకుంటె(Konanakunte) పోలీసులకు అతను చిక్కాడంతో.. అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అతడి తల్లి పర్వీన్ తాజ్ కొడుకును చూసేందుకు తరుచుగా జైలుకు వచ్చేది. జూన్ 13న పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara prison)కు వచ్చిన ఆమె.. ఆ సమయంలో ఓ బాక్సుతోపాటు దుస్తుల బ్యాగ్ను తెచ్చింది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో… జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఆ బ్యాగ్లో రూ.5 లక్షల విలువైన హాషీష్ ఆయిల్ బయటపడింది. వెంటనే జైలు సిబ్బంది పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం అందించగా.. నిందితురాలు పర్వీన్ను అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న కుమారుడికి డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నించి జైలు పాలయ్యింది ఈ మహాతల్లి. అయితే ఇక్కడే ఆమె మరో స్టోరీ చెప్పింది. జైల్లో ఉన్న వ్యక్తికి తన కొడుకు బట్టల బ్యాగ్ ఇవ్వాల్సి ఉందని ఎవరో తనకు ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడంచింది. అందుకే బ్యాగ్ ఇచ్చేందుకు అంగీకరించానని పోలీసుల విచారణలో చెప్పింది. బ్యాగ్లో ఉన్న డ్రగ్స్ గురించి తనకు తెలియలేదని పేర్కొంది. నిందితురాలి వాంగ్మూలం, మొబైల్ కాల్స్ ఆధారంగా తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.