Congress President Election: మల్లికార్జున్ ఖర్గేతో పోటీకి తగ్గేదే లేదంటున్న శశి థరూర్..ఈ ఇద్దరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
పురాతన పార్టీ సంస్థాగతంగా సంస్కరణలకు సిద్దమైంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర వ్యక్తులకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికల్లో..
నానాటికి హస్తం పార్టీ చిక్కి శల్యమవుతోంది. అయితే పూర్వవైభవం కోసం పాకులాడుతున్న పురాతన పార్టీ సంస్థాగతంగా సంస్కరణలకు సిద్దమైంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర వ్యక్తులకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇద్దరు ఉద్దండులు బరిలో నిలిచారు. లాయల్టీకి మారు పేరైన 80 ఏళ్ల ఖర్గే సోనియా అండదండలతో నామినేషన్ వేయగా.. మార్పు కావాలంటే నాకే ఓటేయాలంటూ రంగంలో దిగారు కేరళ ఎంపీ శశిథరూర్. అటు గాంధీ కుటుంబం అండదండలతో ఎవరు బరిలో ఉంటారన్న విషయంపైనా మొదటి నుంచి 10 జనపథ్ కేంద్రంగా హైడ్రామా నడిచింది. తొలి నుంచి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రాజస్తాన్ కేంద్రంగా పెద్ద పొలిటికల్ డ్రామా నడిపించారు. దీంతో ఆయన్ను సైడ్ చేసి దిగ్విజయ్ సింగ్ను తెరపైకి తెచ్చారు. అయితే రాత్రికి రాత్రి మళ్లీ పేరు మారిపోయి సడెన్గా సీన్లోకొ ఎంట్రీ ఇచ్చారు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే.
మల్లికార్జున ఖర్గే రేసులో నిలవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. దళితకార్డు తెరమీదకు తీసుకొచ్చారు. పైగా దక్షిణాదికి చెందిన ఖర్గెకి అవకాశం ఇచ్చారు. మొత్తానికి శశిథరూర్ వర్సెస్ ఖర్గేగా పోటీ మారిపోయింది.
సోనియా అండదండలతో 80 ఏళ్ల దళిత నేత మల్లికార్జున ఖర్గే రంగంలో దిగడంతో ఆయన విజయం దాదాపుగా ఖాయమంటున్నారు రాజకీయ పెద్దలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. గాంధీ కుటుంబానికి లాయల్టీ అయనకు కలిసొచ్చే అంశాలు. గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా ఉండే నాయకులు అంతా ఖర్గేకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా మొదలు పెట్టారు. ఆయన విజయం దాదాపు ఖాయంగా చెబుతున్నారు.
ఇదంతా ఇలా ఉంటే మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగడంతో శశిథరూర్ కూడా కొత్త డైలాగ్ ఎత్తుకున్నారు. పోటీ నిజమే అయినా మా మధ్య శత్రుత్వం లేదని.. ఎవరు గెలిచినా పార్టీ కోసమే అంటూ ప్రకటన ఇచ్చేశారు. మల్లికార్జున ఖర్గే గెలిస్తే పార్టీలో వచ్చే మార్పేమీ ఉండదని.. యథాతథాస్థితి ఉంటుందని.. తనను గెలిపిస్తే పెద్ద మార్పు చూపిస్తానంటున్నారు. స్వతంత్ర నిర్ణయాలతో పార్టీకి జవసత్వాలు తీసుకొస్తానంటున్నారు శశిథరూర్.
మల్లికార్జున ఖర్గే గురించిన కొన్ని వివరాలు..
- 80 ఏళ్ల మాపన్న మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గట్టి గాంధేయవాది అయిన ఖర్గే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన కెరీర్ ప్రారంభంలో అతను ప్రభావవంతమైన కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు.
- ఖర్గే 1969లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. పార్టీలోగుట్టు తెలిసిన అనుభవజ్ఞుడైన నాయకుడిగా.. గాంధీ కుటుంబానికి సన్నిహిత మిత్రుడిగా పరిగణిస్తాయి కాంగ్రెస్ వర్గాలు.
- అంతకుముందు, అతను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా (జూన్ 2013-మే 2014), కార్మిక, ఉపాధి మంత్రిగా (మే 2009-జూన్ 2013) పనిచేశారు.
- అతను 1972 నుంచి 2009 వరకు 10 వరుస విజయాలను నమోదు చేయడం ద్వారా కర్ణాటకలోని గుల్బర్గాలో ఎన్నికల చరిత్ర సృష్టించారు. 2019లో బిజెపికి చెందిన ఉమేష్ జాదవ్ చేతిలో ఓడిపోవడంతో అతను తన మొదటి ఎన్నికల ఓటమిని చవిచూశారు.
- దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఖర్గే కలిసివచ్చే అంశం. ఆయన పార్టీ చీఫ్గా ఎదగడం కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది.
- 80 ఏళ్ల నాయకుడు ఎదుర్కొనే ఏకైక సమస్య అతనికి హిందీ బెల్ట్లో పాన్-ఇండియా అప్పీల్ లేకపోవడం
శశి థరూర్ గురించి మనం తెలుసుకోవలసినవి..
- అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో కాంగ్రెస్ కురువృద్ధుడు శశి థరూర్.. 2009లో పార్టీలో చేరారు. థరూర్ UPA ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా (2009–2010), మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా (2012–2014) పనిచేశారు.
- పార్టీలో అత్యంత స్పష్టమైన నాయకులలో ఒకరు. అంతే కాదు ట్విట్టర్ అభిమాని అయిన థరూర్ భారతదేశంలోని యువతలో అధిక ఆకర్షణను కలిగి నాయకుడు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చిన ఘనత ఆయనకుంది.
- ది హిందూ, డెక్కన్ క్రానికల్స్ మొదలైన వాటిలో మాజీ కాలమిస్ట్. పార్టీ నాయకత్వంలో సంస్కరణలను సూచించిన సభ్యుల్లో మొట్టమొదటి వ్యక్తి. మలయాళ దినపత్రిక మాతృభూమిలో తన కథనంలను ప్రచూరిస్తుంటారు.
- అతను నిష్పక్షపాతంగా , స్వేచ్ఛగా ఎన్నికలను కోరుకుంటున్న నేత
- 2006లో UN సెక్రటరీ జనరల్ పదవికి రెండవ రన్నరప్గా, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలపై బలమైన అవగాహన కలిగిన వ్యక్తిగా థరూర్ను ఇతర పార్టీల వారు చూస్తుంటారు.
- అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 19న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం