Harsh Sanghavi: దేశంలో అత్యాచారాలకు ఫోన్లే కారణం.. గుజరాత్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
Rape Cases in India: గుజరాత్ హోంమంత్రి, బీజేపీ నేత హర్ష్ సంఘవి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అత్యాచారాలకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్లే..
Rape Cases in India: గుజరాత్ హోంమంత్రి, బీజేపీ నేత హర్ష్ సంఘవి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అత్యాచారాలకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్లే.. అంటూ హర్ష్ సంఘవి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో సంఘవి (Harsh Sanghavi) ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అశ్లీల వీడియో కంటెంట్ చాలా అందుబాటులో ఉందని.. ఇవి మొబైల్ ఫోన్లలోకి సులభంగా వచ్చేస్తున్నాయన్నారు. ఈ అశ్లీల వీడియోలు కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి నాటి నుంచి దేశంలోని అశ్లీల సైట్ల వీక్షకుల సంఖ్య 95 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని సంఘవి పేర్కొన్నారు. దేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైనట్లు హర్ష్ సంఘవి తెలిపారు.
అత్యాచార ఘటనలు సమాజానికి మాయని మచ్చలా నిలుస్తాయని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. కానీ ప్రతిసారి వారిని నిందించలేమంటూ అభిప్రాయపడ్డారు. కుమార్తెపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ తప్పు పోలీసులది కాదని.. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్ఫోన్ అంటూ హోం మంత్రి హర్ష్ సంఘవి పేర్కొన్నారు. మన దేశంలో గుజరాత్ అత్యంత సురక్షితమైనదని..ఎంత సేఫ్ అయినా.. మన నగరం లేదా రాష్ట్రంలో ఒకటి లేదా రెండు సంఘటనలు జరిగితే మంచిది కాదంటూ అభిప్రాయపడ్డారు.
Also Read: