Crash Landing: రన్ వే పై జారిపోయిన మధ్యప్రదేశ్ రాష్ట్ర విమానం.. పైలెట్ సహా ముగ్గురికి గాయాలు..
Plane crash landing: గ్వాలియర్ విమానాశ్రయంలో గురువారం మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం కూలిపోయింది.
Crash Landing: గ్వాలియర్ విమానాశ్రయంలో గురువారం మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా రాష్ట్ర విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ కెప్టెన్ సయీద్ మజీద్ అక్తర్, పైలట్ శివశంకర్ జైస్వాల్, ఒక అధికారి గాయపడ్డారు. అందరినీ గ్వాలియర్లోని జేఏహెచ్ (జైరోగ్య హాస్పిటల్) లో చేర్చారు. ఈ విమానం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి రెమెడిస్విర్ ఇంజెక్షన్స్ తో ఇక్కడకు వచ్చింది.
అహ్మదాబాద్ నుండి రెమెడెసివిర్ ఇంజెక్షన్ తీసుకొని విమానం మొదట ఇండోర్ చేరుకుంది. అక్కడ ఇంజెక్షన్స్ దిగుమతి చేసిన తరువాత, మిగిలిన వాటితో గ్వాలియర్ విమానాశ్రయానికి విమానం చేరుకుంది. కానీ, గ్వాలియర్లో దిగడానికి ముందు విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సీనియర్ పైలట్ కెప్టెన్ సయీద్ మజీద్ అక్తర్ నిర్ణీత స్థానానికంటే 200 మీటర్ల ముందు విమానాన్ని రన్వేపై దించాల్సి వచ్చింది. పైలెట్ విమాన వేగాన్ని తగ్గించేటప్పుడు విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాడు, కానీ, విమానం రన్ వే పై జారిపోయి పక్కకు ఒరిగిపోయింది.
గ్వాలియర్లో ఈ విమానం ద్వారా గ్వాలియర్ మరియు చంబల్ మండలాల కోసం 71 బాక్స్ ల రెమెడెస్విర్ ఇంజక్షన్ లు వచ్చాయి. వీటితో పాటు జబల్పూర్ కోసం కొన్ని బాక్స్ లు కూడా ఈ విమానంలో ఉన్నాయి. గ్వాలియర్ లో డెలివరీ అయిన తరువాత ఈ విమానం జబల్పూర్ వెళ్ళాల్సి ఉంది.
రన్వేపై సాంకేతిక లోపంతో 6 సీట్ల రాష్ట్ర విమానం క్రాష్ లాండ్ అయిందని మహారాజ్పురా సీఎస్పీ రవి భదౌరియా తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఒక లోకో పైలట్ గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందో సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ విమానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కొనుగోలు చేసింది. చిన్న చిన్న మరమ్మతుల అనంతరం ఈ విమానం 100 గంటల ఎగిరే పరీక్షలు పూర్తి చేసుకుంది. అటు తరువాత దీనిని రెమెడిస్విర్ ఇంజెక్షన్లు, టీకాలు అలాగే ఇతర అత్యవసర మందులను రాష్ట్రంలోని వివిధ నగరాలకు పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నారు.
Engineering Classes: సెప్టెంబర్ 15 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతుల ప్రారంభం.. ప్రకటించిన ఏఐసీటీఈ..