Lockdown: ఉప ఎన్నికల తర్వాత అక్కడ లాక్డౌన్…? కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
Lockdown: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కేసుల సంఖ్య తగ్గి, మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో....
Lockdown: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కేసుల సంఖ్య తగ్గి, మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ ముఖ్యమంత్రి యడియూరప్ప సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నెల 17న బెళగావి లోక్సభ, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నందున, ఆ తర్వాత లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
కరోనా ప్రభావంపై ఈనెల 18 లేదా 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి తదితరులను ఆహ్వానించాలని, ఆ భేటీ తర్వాత లాక్డౌన్ ప్రకటించనున్నారు. 20వ తేదీ నుంచి కనీసం 10 రోజులు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజుకు 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం బీదర్లో విలేకరులతో మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
కాగా, కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్ కాదు కానీ.. అలాంటిదే విధించారు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే. మహా జనతా కర్ఫ్యూ బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిందని, విధి లేని పరిస్థితుల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తునట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో కొంత జాప్యం జరుగుతున్న వార్తలు వాస్తవమేనని ఉద్దవ్ అంగీకరించారు. వైరస్ కారణంగా విలవిలలాడుతున్న మహారాష్ట్రను ఆదుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు సీఎం ఉద్దవ్. ఇలా దేశంలో కరోనా మమహ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మరోవైపు కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది.
ఇవీ చదవండి: మహారాష్ట్రలో లాక్డౌన్ ఉండదు.. రెండు వారాలపాటు 144 ఆంక్షలు.. కీలక ప్రకటన చేసిన సీఎం ఉద్ధవ్ఠాక్రే