లాక్డౌన్ ఎఫెక్ట్.. గంగపాలు కానున్న లక్షల లీటర్ల బీరు.. 700 కోట్ల మద్యం కూడా..!
కరోనా ఎఫెక్ట్ మద్యం పరిశ్రమలపై భారీగా పడింది. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోగా..తయారీ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి.
కరోనా ఎఫెక్ట్ మద్యం పరిశ్రమలపై భారీగా పడింది. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోగా..తయారీ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి. బార్లు, క్లబ్ల్లో లభ్యమయ్యే ప్రెష్, క్రాఫ్ట్ బీరు త్వరగా పాడవ్వనుండగా.. వీటి నిల్వల కోసం తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్, ఇతర ఖర్చులు మీద పడుతుండటంతో తయారీ కేంద్రాలకు నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో నిల్వలను ఖాళీ చేసేందుకు తయారీ కేంద్రాలు సిద్ధమయ్యాయట. అంతేకాదు హరియాణా గుర్గ్రామ్లోని కొన్ని కేంద్రాలు పారబోతను మొదలుపెట్టాయట.
ఇక క్రాఫ్ట్ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. ప్రస్తుతం అన్ని ప్లాంట్లలో కలిపి ఎనిమిది లక్షల లీటర్ల ప్రెష్ బీర్ నిల్వలు ఉన్నాయి. లాక్డౌన్ ఇలానే కొనసాగితే ఆ బీరంతా పాడవుతుంది కాబట్టి.. మైక్రో బ్రూవరీస్ వ్యాపారం దెబ్బతినకుండా.. గ్రోలర్స్ సాయంతో టేక్- అవే సదుపాయానికి అనుమతించాలని అసోషియేషన్ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు ఢిల్లీ మినహా ఉత్తర భారతంలో రూ.700కోట్ల విలువైన విదేశీ మద్యం నిల్వలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ నిల్వలు ఖాళీ కావాల్సి ఉంది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో అవన్నీ అలానే ఉండగా.. పాత స్టాక్ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వాలి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈరోజు నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
Read This Story Also: పవన్ చేయాల్సిన రీమేక్లో నటించబోతున్న చిరు..!