ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. తొలగించిన ఉద్యోగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామన్న ఆ రాష్ట్ర సర్కార్
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులను త్వరలోనే తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది.
Karnataka State RTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ఉద్యోగులను త్వరలోనే తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. సమ్మె కాలంలో సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని రవాణాశాఖ మంత్రి శ్రీ రాములు తెలిపారు. బుధవారం తుమకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ రాష్ట్రవ్యాప్త సమ్మెకాలంలో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించారని, మరికొందరిని సస్పెండ్ చేయడమే కాకుండా ఇతర జిల్లాలకు బదిలీలు చేశారన్నారు. అప్పట్లో అనివార్యమైన పరిస్థితిలో అలాంటి చర్యలు తీసుకోవల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.
అయితే, వారి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారందరికీ మరో అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తొలగించిన, సస్పెండ్ అయిన, ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారి వివరాలను జిల్లాల వారిగా సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. త్వరలోనే ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే, కర్ణాటక రాష్ట్రంలో పేద విద్యార్థులకు కర్ణాటక సర్కార్ కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీరాములు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అనుకూలం కావాలనే ఉచిత బస్సుపాసులను మంజూరు చేస్తున్నామన్నారు. వేటుపడిన ఉద్యోగులు వారి కుటుంబీకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మానవత్వంతో వారికి మళ్లీ ఉద్యోగాలు కల్పించే ఆలోచన ఉందన్నారు.