సోనియాను టార్గెట్ చేసిన కంగనా రనౌత్
మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఈ సారి మహరాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్ను కంగనా టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఈ సారి శివసేనను కాకుండా మహరాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్ను కంగనా టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేసింది. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం నా పట్ల వ్యవహరిస్తున్న తీరు సాటి మహిళగా మీకు బాధ అనిపించడం లేదా అని సోనియాని ప్రశ్నించింది.
ఓ మహిళ పట్ల మహరాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీకు పట్టదా అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచుకోవాలని మీరు ప్రభుత్వానికి సూచించలేరా? మీరు విదేశాల్లో పెరిగినా… భారత్లో నివసిస్తున్నారు. మహిళ చేస్తున్న పోరాటం గుర్తించరా? మీ మౌనం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీ సొంత ప్రభుత్వమే ఓ మహిళను తీవ్రంగా వేధిస్తోంది అంటూ మండిపడింది కంగన. మహా సర్కారు చేస్తున్న అరాచకంపై ఇప్పటికైనా కలగ చేసుకుంటారని భావిస్తున్నాననంటూ కంగనా ట్వీట్లో పేర్కొంది.
బాంద్రాలోని పాళీ హిల్ లోని కంగనా బంగ్లాను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేయడంపై వివాదం మరింత రాజుకుంటోంది. బీఎంసీతోపాటు శివసేనపై కంగనా విమర్శలకు దిగింది. శివ సేన పార్టీ సోనియా సేనగా మారిందంటూ దుయ్యబట్టింది. బీఎంసీ అధికారులు గూండాలుగా వ్యవహరించారంటూ మండిపడింది.
‘ఏ భావజాలంతో బాలాసాహెబ్ ఠాక్రే శివ సేనను నిర్మించారో అలాంటి పార్టీ ఇవ్వాళ తన ఐడియాలజీని అమ్మడానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ శివ సేన నుంచి సోనియా సేనగా మారుతోంది. నా వెనుకు నుంచి నా ఇంటిని కూలగొట్టిన అధికారులను సివిక్ బాడీ అని పిలవొద్దు’ అని కంగనా ట్వీట్ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సిగ్గులేకుండా పొత్తు పెట్టుకొని శివ సేనను సోనియా సేనగా మార్చారని కంగనా కామెంట్ చేసింది.
శివ సేనతోపాటు, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను ఉద్దేశించి.. ‘మీ నాన్న వల్ల మీకు ఐశ్వర్యం, సంపద లభించొచ్చు. కానీ గౌరవాన్ని మీరే సొంతంగా సంపాదించాలి. ఎన్ని నోళ్లను మీరు మూయిస్తారు. ఎన్ని గొంతుకలను అణచివేస్తారు. నిజం నుంచి ఎన్నాళ్లు పారిపోతారు?’ అని కంగనా పేర్కొంది
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా కంగనా రనౌత్పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం కలిగించేలా కంగనా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్ పై ఒక కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ను కంగనా “తుఝే” అని ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవపరిచిందని కేసు నమోదైంది. ఉద్ధవ్ థాకరే తుఝే క్యా లగ్ తా హై అంటూ కంగనా మాట్లాడిన వీడియోపై శివసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదైంది.
తన ఆఫీసును కూల్చివేసిన తర్వాత కంగనా బీఎంసీ అధికారులపై, మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు జరిగిన ఘటనను కశ్మీర్ పండిట్ల ఘటనతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఒక మతం, వర్గం వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కంగనాపై రెండో కేసు నమోదైంది.