Joe Biden Administration: భారత వైమానిక దళానికి అత్యాధునిక పోరాట విమానాలు, జోబైడెన్ ప్రభుత్వ నిర్ణయం
భారత వైమానిక దళానికి అమెరికా నుంచి అత్యాధునిక పోరాట విమానాలు అందనున్నాయి. ఎఫ్-15 ఈ ఎక్స్ గా వ్యవహరించే ఈ విమానాలు ఎలాంటి వాతావరణ పరిస్థితుల..
భారత వైమానిక దళానికి అమెరికా నుంచి అత్యాధునిక పోరాట విమానాలు అందనున్నాయి. ఎఫ్-15 ఈ ఎక్స్ గా వ్యవహరించే ఈ విమానాలు ఎలాంటి వాతావరణ పరిస్థితుల నైనా తట్టుకోగలవని, రాత్రి వేళ కూడా వీటి టార్గెట్ నుంచి ఏదీ తప్పించుకోజాలదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఫైటర్ జెట్ విమానాలపై భారత-అమెరికా వైమానిక విభాగాలు పరస్పర సమాచారాన్ని ఇఛ్చి పుచ్చుకున్నాయని ఈ వర్గాలు వివరించాయి. తమ లేటెస్ట్ మల్టీ రోల్ కొంబాట్ విమానాలను భారత వైమానిక దళానికి అందించేందుకు జోబైడెన్ ప్రభుత్వం అంగీకరించిందని బోయింగ్ ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్ట్ నర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ మరియా హెచ్ లైన్ తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే భారత వైమానిక దళం తన ఆధునిక సూపర్ సోనిక్ జెట్ ఫైటర్లతో అత్యంత పోరాట సత్తాను సాధించింది. రక్షణ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద పోరాట విమానాలు పొంచి ఉన్నాయి. చైనా నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా దానినెదుర్కొనేందుకు ఇవి సిద్దంగా ఉన్నాయి. మన వైమానిక పోరాట సామర్థ్యాన్ని గుర్తించిన చైనా ఇప్పటివరకు కామ్ గా ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఈ అత్యాధునిక విమానాలు భారత్ వైమానిక శ్రేణిలో చేరడం ముదావహమని అంటున్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది.