Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తం.. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు.
Internet services snapped in Delhi-NCR : న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులు చేపట్టిన ట్రాక్టర్ల రిపబ్లిక్ పరేడ్ మంగళవారం హింసాత్మకంగా మారింది. చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. బారికేడ్లను దాటుకుంటూ ఢిల్లీ నలువైపులా నుంచి రైతులు ఎర్రకోటకు చేరుకొని జెండాను ఎగురవేశారు. నగరంలోకి దూసుకొచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ సందర్భంగా పోలీసులు లాఠిచార్జ్ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం ప్రయోగించారు. ఎప్పుడూ లేనట్టుగా జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీ రైతుల నిరసనలతో హోరెత్తింది.
ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో ఉన్నతాధికారులు పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యక్షిస్తూ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.