ఇండో-చైనా చర్చలు నేడే.. వివాదాలు పరిష్కారమవుతాయా ?
భారత-చైనా దేశ దళాలు శనివారం ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నాయి. ఉభయ దేశాల సైనిక దళాల మధ్య ఉద్రిక్థతలు రేగిన నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను..
భారత-చైనా దేశ దళాలు శనివారం ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నాయి. ఉభయ దేశాల సైనిక దళాల మధ్య ఉద్రిక్థతలు రేగిన నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లడఖ్ లోని ఛుషుల్-మొల్డోలో గల ఇండియన్ బోర్డర్ పాయింట్ వద్ద ఈ చర్చలు జరగనున్నాయి. భారత దళాల తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ ఈ సంప్రదింపుల్లో పాల్గొననున్నారు. ఇప్పటివరకు ప్రాంతీయ మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.లడఖ్ తూర్పు ప్రాంతంలో.. యధాతథ స్థితిని కొనసాగించాలని, వాస్తవాధీన రేఖ వద్ద చేపడుతున్న భారీ నిర్మాణాలను నిలిపివేయాలని భారత్.. చైనాను కోరుతోంది. డీ ఫ్యాక్టోబోర్డర్ వద్ద మౌలిక సదుపాయాల అభివృద్దికి మేం జరుపుతున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దని కూడా తాము ఈ చర్చల సందర్భంగా అభ్యర్థిస్తామని భారత సైనికవర్గాలు వెల్లడించాయి. లడఖ్, సిక్కిం ప్రాంతాలలో భారత దళాల సాధారణ గస్తీని కూడా చైనా సైనికులు అడ్డగిస్తున్నారు. అయితే ఇలా ఉద్రిక్తతల నివారణకు మొదట ఉభయ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇండియాయే కోరడం విశేషం.