Ayodhya Ram Mandir: ఆయోధ్య రామాలయానికి భారీగా వస్తోన్న డొనేషన్లు.. ఇప్పటి వరకు వచ్చిన విరాళాల మొత్తం ఎంతంటే..?
Ayodhya Ram Mandir: రామజన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరోవైపు రామమందిరం నిర్మాణం..
Ayodhya Ram Mandir: రామజన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరోవైపు రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన విరాళాల సేకరణకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. సామాన్యులు మొదలు, ప్రముఖుల వరకు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటిస్తున్నారు. జనవరి 15న ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభం అవగా.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధృవీకరించింది. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ. 100 కోట్లు విరాళాలుగా వచ్చాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ నిర్మాణ ఇప్పటికే ప్రారంభమైందని, మూడు సంవత్సరాల్లో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కాగా, జనవరి 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27న ముగియనుంది. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే ఇంత భారీ మొత్తంలో విరాళాలు రవడంపై ట్రస్ట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. భారత ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుగా ఎంతోమంది ప్రముఖులు రామాలయ నిర్మాణానికి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఏళ్ల తరపడి కొనసాగిన వివాదానికి చెక్ పెడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఆగస్టు 05వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. దాంతో రామమందిరం నిర్మాణానికి తొలి అడుగుపడినట్లైంది. అయితే, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయం కావడంతో హిందువులందరినీ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావించింది. ఆ మేరకు దేశంలోని ప్రతి కుటుంబం నుంచి విరాళాలు సేకరిస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.
Also read:
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం ఎంతంటే..?
పెళ్లి చేయమన్న తనయుడు.. ఇంట్లోంచి గొడ్డలి తీసుకొచ్చిన తండ్రి ఏం చేశాడంటే..?