Gujarat Election: గుజరాత్లో ముగిసిన రెండో విడత ప్రచారం.. సోమవారం 93 స్థానాల్లో పోలింగ్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ముగిసింది. రెండో విడతలో 93 స్థానాలకు డిసెంబర్ 5న సోమవారం పోలింగ్ జరగనుంది. గుజరాత్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు 14 జిల్లాల్లోని..
Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ముగిసింది. రెండో విడతలో 93 స్థానాలకు డిసెంబర్ 5న సోమవారం పోలింగ్ జరగనుంది. గుజరాత్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 93 స్థానాలకు 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికోసం ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి. భారతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ వెంట అవసరమైన గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ రోజు సాయంత్రం వరకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి.
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి ఇప్పటికే మొదటి విడతలో 89 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. 93 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. బీజేపీకి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నించాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, ఆప్ మాటలు నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు.
చివరి రోజు బీజేపీ కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. చెన్పూర్ లో సిఎం భూపేంద్ర పటేల్ రోడ్ షో నిర్వహించారు. దీంతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో నిర్వహించారు. ఇంకా స్మృతి ఇరానీ, హర్ష్ సంఘ్వీ, పర్సోత్తమ్ రూపాల, నటుడు మనోజ్ జోషి తదితరులు ప్రచారం చేశారు. బీజేపీని మరోసారి గెలిపించాలంటూ కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..