GST పరిధిలోకి మరిన్ని వస్తువులు.. వేటి ధరలు తగ్గుతాయో.. వేటి ధరలు పెరుగుతాయో తెల్సా..?
కేంద్ర ప్రభుత్వం మరిన్ని వస్తువుల్ని GST పరిధిలోకి తీసుకొచ్చింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. మరి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి?
GST new rates: వంటగదిలో ఇప్పటికే వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఇకపై నిత్యావసరాల ధరలు కూడా పెరగబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో.. రోజువారీగా వాడే చాలా వస్తువుల ధరలు మండిపోనున్నాయి. బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలను ప్యాక్ చేస్తే 5 శాతం జీఎస్టీ కట్టాల్సిందే. ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనే, ఎండిన చిక్కుడు గింజలు, ఎండిన మఖానా, ఇతర ధాన్యాలపైనా జీఎస్టీ విధించారు. ఇక గోధుమ పిండి, మెస్లిన్ పిండి, బెల్లం, మురమురాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరి కాంపోస్ట్ లాంటివాటికి 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ జాబితాలో ఉన్న వస్తువులన్నీ సామాన్యుల వంటగదిలో తరచుగా ఉపయోగించేవే. ప్యాక్ చేయని, లేబుల్ లేనిస బ్రాండెడ్ లేని వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే ఆ వస్తువుల్ని ప్యాక్ చేసి అమ్మితే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక కత్తుల రేట్లు కూడా పెరగనున్నాయి. వంటగదిలో వాడే కత్తులతో పాటు.. బ్లేడ్లు, పేపర్ నైవ్స్, పెన్సిల్ షార్ప్నర్స్, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లపై విధించే జీఎస్టీ 12 శాతం నుంచి 18శాతానికి పెంచారు. కరెంటుతో నడిచే సెంట్రిఫుగల్ పంపులు, టర్బైన్ పంపులు, నీటిలో మునిగే మోటార్ పంపులు, సైకిల్ పంపులపైనా జీఎస్టీ 18శాతానికి పెంచారు. అంతేకాదు భారీ యంత్రాలు, వెట్ గ్రైండర్లపైనా జీఎస్టీని 18శాతం విధించారు.
బ్యాంకులు ఇచ్చే చెక్ బుక్పై జీఎస్టీ చెల్లించాలి. చెక్కుల్ని విడిగా ఇచ్చినా పుస్తకం రూపంలో ఇచ్చినా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. రోజుకు 1000 రూపాయల లోపు ధరలు ఉన్న హోటల్ గదులకు 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు కేటగిరీలో ఉంది. కాబట్టి కస్టమర్లు 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో తీసుకునే రూమ్స్కి జీఎస్టీ చెల్లించాలి. ఐసీయూ తప్ప 5,000 రూపాయల కన్నా ఎక్కువ డైలీ రెంట్ ఉన్న గదులకు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించదు. ఎల్ఈడీ లైట్స్, బల్బుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటిపై జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం జీఎస్టీ బదులు 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని సూచించింది.
ఇక కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని తగ్గించారు. వీటిలో రక్షణ రంగంలో వాడే వస్తువులు సేవలపై జీఎస్టీ విధించకూడదని నిర్ణయించారు. రోప్వే రైడ్లపై GST 18శాతం నుంచి ఐదు శాతానికి తీసుకొచ్చారు. ఇక వస్తువుల క్యారీయింగ్ రెంట్లపైనా జీఎస్టీ తగ్గింపు వర్తించనుంది.