PM Modi: రాజకీయ స్వార్థం కోసం పెట్రోల్, డీజిల్ కూడా ఫ్రీ అంటారు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం..
రాజకీయ స్వార్థం కోసం కొన్ని పార్టీలు ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూడా ఇస్తామంటూ ప్రకటిస్తాయని.. అలాంటి పార్టీల పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ పేర్కొన్నారు.
PM Modi on opposition: గుజరాత్లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్నికల హామీలు గుప్పిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటు విమర్శలు చేశారు. హర్యానాలోని పానిపట్లో రూ.900 కోట్లతో ఏర్పాటు చేసిన 2జీ ఈథనాల్ ప్లాంట్ను బుధవారం ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. రైతులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం కొన్ని పార్టీలు ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూడా ఇస్తామంటూ ప్రకటిస్తాయని.. అలాంటి పార్టీల పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ పేర్కొన్నారు. అలాంటి హామీలు మన పిల్లల హక్కులను హరిస్తాయని, దేశం ఆత్మనిర్భర్ కాకుండా అడ్డుకుంటాయన్నారు. అంతేకాదు, ఉచిత హామీలతో నిజాయితీగా పన్నులు చెల్లించే వాళ్లకు అన్యాయం జరుగుతుందన్నారు. కొత్త టెక్నాలజీలో పెట్టుబడులకు ఆటంకం కలిగించడం వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేసి ఓట్లను కోరుతున్నాయి.. ఇది దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఏడాదే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ హామీ ఇచ్చింది ఆప్. అదే హామీని ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోయే గుజరాత్లోనూ రిపీట్ చేస్తోంది. మరోవైపు, రాజకీయ పార్టీలు ఉచిత హామీలను కంట్రోల్ చేయడానికి ఒక కమిటీని నియమించాలని కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్పైనా విమర్శలు చేశారు. ఆగస్ట్ 5న కొంతమంది నల్లదుస్తులు ధరించి నిరసన చేశారు. బ్లాక్ మ్యాజిక్ చేయాలని చూశారు. కాని వాళ్ల మాటలను దేశ ప్రజలను నమ్మడం లేదని కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..