కరోనా దెబ్బకు కోటిన్నర జాబ్స్ హుష్ కాకి ! ముంచుకొస్తున్న సంక్షోభం
కరోనా, లాక్ డౌన్ ల దెబ్బకు ఇండియాలో వివిధ రంగాలు తల్లడిల్లుతున్నాయి. దుస్తుల రంగం, జువెల్లరీ, చేనేత, తోలుపరిశ్రమ వంటి వివిధ రంగాలు కుదేలవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా అన్ని ఆర్దర్లను మధ్యలోనే రద్దు చేయవలసివస్తోందని.....
కరోనా, లాక్ డౌన్ ల దెబ్బకు ఇండియాలో వివిధ రంగాలు తల్లడిల్లుతున్నాయి. దుస్తుల రంగం, జువెల్లరీ, చేనేత, తోలుపరిశ్రమ వంటి వివిధ రంగాలు కుదేలవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా అన్ని ఆర్దర్లను మధ్యలోనే రద్దు చేయవలసివస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ హెడ్ శరద్ కుమార్ శరఫ్ తెలిపారు. లాక్ డౌన్ అనంతరం కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఉండకపోవచ్ఛు నన్నారు. మూలధన పెట్టుబడి హారతి కర్పూరంలా హరించుకుపోతోందని, దేశీయంగా, విదేశాల నుంచి వచ్ఛే ఆర్దర్లను 50 శాతం పైగా క్యాన్సిల్ చేయవలసి వస్తోందని ఆయన చెప్పారు. ఫలితంగా కోటీ 50 లక్షల మంది ఉద్యోగాలకు, వారి ఉపాధికి ఎసరు వచ్ఛే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా లేబర్ ఫీల్డ్ లో రిట్రెంచ్ మెంట్ ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయన్నారు. జువెల్లరీ ఎగుమతులకు సంబంధించి సుమారు 30 లక్షల మందికి ఉద్వాసన తప్పదన్నారు. చేనేత రంగంలో 20 లక్షల మందికి ముప్పు తప్పకపోవచ్ఛు.. కార్పెట్స్, ఇంజనీరింగ్, రిటైల్ సెక్టార్స్ ప్రమాదంలో పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కస్టమర్లు, ఫ్యాక్టరీలు తమ బకాయిలను విడుదల చేయకపోవడంతో దుస్తుల ఎగుమతి రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. డిజైన్ ఎక్స్ పోర్ట్ రంగానిదీ ఇదే పరిస్థితి. ఈ రంగంలో 50 వేల నుంచి 75 వేల మంది ఇంటిబాట పట్టవచ్ఛునని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫాబ్రిక్స్, గార్మెంట్స్ రంగంలో 32 మిలియన్లకు పైగా సిబ్బందిని వినియోగించుకోవలసి ఉంటుంది. వీరిలో చాలామంది లేబర్ కార్మికులే .. కానీ తగినన్ని ఆర్దర్లు లేక వీరంతా ఉసూరుమంటున్నారు. వీరిలో ఎంతమంది ఉద్వాసనకు గురవుతారో తెలియడంలేదు. ఆభరణాల ఎగుమతిదారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస సిబ్బందితో ఫ్యాక్టరీలు పని చేయలేనప్పుడు దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈ రంగ నిపుణులు అంటున్నారు. ఇండియా చాలావరకు మార్కెట్లను చైనాకు ధారాదత్తం చేస్తోందని, ఈ ట్రెండ్ మారి ఉత్పాదక రంగానికి ప్రభుత్వం చేయూత నిచ్చి.. రాయితీలు కల్పించి, ప్యాకేజీని ప్రకటించిన పక్షంలో పరిస్థితి కొంత మెరుగుపడుతుందని వీరు సూచిస్తున్నారు.