Electricity Amendment Bill 2022: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విద్యుత్ సవరణ బిల్లు..
Electricity Amendment Bill 2022: విద్యుత్ సవరణ బిల్లుపై మొండిగా ముందుకెళ్తోంది కేంద్రం. విపక్షాల నిరసనలు.. ఆందోళనల్ని లెక్కచేయని కేంద్రం..
Electricity Amendment Bill 2022: విద్యుత్ సవరణ బిల్లుపై మొండిగా ముందుకెళ్తోంది కేంద్రం. విపక్షాల నిరసనలు.. ఆందోళనల్ని లెక్కచేయని కేంద్రం.. సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టాయి. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును మరిన్ని సంప్రదింపులు, చర్చల కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపింది కేంద్రం.
ముఖ్య ఉద్దేశం అదే..
విద్యుత్ పంపిణీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు గత చట్టానికి సవరణలు రూపొందించారు. తాజా బిల్లుపై వ్యతిరేక స్వరాలు విన్పిస్తున్నాయి. ఈ బిల్లు సహకార స్ఫూర్తి, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు.
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు..
కొత్త విద్యుత్ చట్టాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు నిరసనలకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా మహాధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ చట్టంతో వినియోగదారులకే తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే కుట్రలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు. బిల్లును ఉపసంహరించుకోకపోతే మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వరంగల్లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నలుపు దుస్తులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
అటు ఏపీలోనూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ఆందోళన చేపట్టారు. గుణదల విద్యుత్ సౌధ కార్యాలయంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 30 విద్యుత్ సంఘాల నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరిపిన తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..