Casino Case: కాసినో కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న ఈడీ.. మంత్రి కొడుకుకూ నోటీసులు..
కాసినో కేసులో ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించిన ఈడీ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. అదే దూకుడుతో మంత్రి పీఏ హరీష్ను మరి కాసేపట్లో..
కాసినో కేసులో ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించిన ఈడీ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. అదే దూకుడుతో మంత్రి పీఏ హరీష్ను మరి కాసేపట్లో విచారించనున్నారు. నేపాల్లో జరిగిన బిగ్ డాడీ ఈవెంట్పై, విదేశాల్లో క్యాసినో వ్యాపారం, ఫేమా నిబంధనల ఉల్లంఘనలపై మంత్రిని ఈడీ ప్రశ్నించబోతుందనే వార్తలు వస్తున్నాయి. నేపాల్లో జరిగిన బిగ్ డాడీ ఈవెంట్పై హరిష్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈడీ అధికారుల విచారణలో కాసినో కేసు కీలక సూత్రధారి అయిన చికోటి ప్రవీణ్ అందించిన సమాచారం మేరకు, అతను అందించిన కొత్త పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వెంటనే వారు విచారనకు రావాలని వారికి నోటీసులను పంపిన ఈడీ.. వారి నుంచి తగిన సమాచారం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు సోమవారం మంత్రి తలసాని పీఏ హరీష్ను కాసినో వ్యవహారంలో తన పాత్ర ఏమిటన్నదానిపై ఈడీ అధికారులు ఆయన్ను విచారించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని తన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. మరోవైపు ఇదే అంశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరయినట్టు సమాచారం. ఇంకోవైపు ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు.
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.