రంగు మారుతున్న ఢిల్లీ రాజకీయం

దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. మినీ ఇండియాగా ఉన్న హస్తిన ఓటర్ల చూపు ఏ పార్టీ వైపు? ఎవరు ఢిల్లీ విజేతగా నిలిచేది.? ఢిల్లీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ ఎలా వుంది? ఇప్పుడు ఈ అంశాలు దేశం నలుమూలలా చర్చనీయాంశాలుగా మారాయి. 70 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీ. రాష్ట్రం చిన్నదే అయినా, అసెంబ్లీ […]

రంగు మారుతున్న ఢిల్లీ రాజకీయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2020 | 3:30 PM

దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. మినీ ఇండియాగా ఉన్న హస్తిన ఓటర్ల చూపు ఏ పార్టీ వైపు? ఎవరు ఢిల్లీ విజేతగా నిలిచేది.? ఢిల్లీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ ఎలా వుంది? ఇప్పుడు ఈ అంశాలు దేశం నలుమూలలా చర్చనీయాంశాలుగా మారాయి.

70 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీ. రాష్ట్రం చిన్నదే అయినా, అసెంబ్లీ సీట్లు తక్కువగానే ఉన్నా.. దేశరాజకీయాలను ప్రభావితం చేయడంలో మాత్రం హస్తిన నగరం తక్కువేం కాదు. దేశ రాజధాని కావడం, అందులో అన్ని వర్గాల, రాష్ట్రాల ప్రజలు నివసిస్తుండటమే ఇందుకు కారణం.

ఈ సారి జరిగే ఎన్నికల్లో సుమారు ఒక కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పును ఇస్తారనడానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత చేతులెత్తేసింది. అనంతరం 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏడు పార్లమెంట్ స్థానాలకు ఏడు సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాలను కైవసం చేసుకొని భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇదే ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు.

ఇక ఈ సారి జరిగే ఎన్నికలు ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను సొంతం చేసుకొని హస్తిన అసెంబ్లీలో పునర్ వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఢిల్లీలోని ఏడు స్థానాలను గెలుపొందింది. 50 శాతానికిపైగా ఓట్లను సొంతం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖులు కూడా ఓటమిపాలయ్యారు. అంతే కాదు ఐదు చోట్ల ఆ పార్టీ మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.అయితే 2015 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఏర్పడ్డాయి. అప్పటి మ్యాజిక్‌ను కేజ్రీ ఇప్పుడు కూడా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది..

మరోసారి హస్తిన అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఎన్నికల ఫలితలనే పునరావృతం చేస్తూ తిరుగులేని విధంగా జెండా ఎగురవేయాలని వ్యూహాలను సిద్ధం చేసింది చీపురు పార్టీ. ప్రధానంగా గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కేజ్రీవాల్. అటూ ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా పేరుమోసిన ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో జతకట్టారు. మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన సంస్థ ఐపాక్‌తో కేజ్రీవాల్ ఒప్పందం చేసుకున్నారు.

ఇక 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేజ్రీవాల్ వ్యూహం మార్చారు. ముఖ్యంగా.. ప్రధాని మోదీతో నేరుగా తలపడటాన్ని మానుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు కేజ్రీవాల్ వర్సెస్ మోదీ అనే పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఆయన స్థానిక సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేశారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఢిల్లీ ఓటర్లపై ప్రజాకర్షక పథకాల జల్లు కురిపించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేశారు.

10 ముఖ్యమైన హామీలతో కేజ్రీవాల్ గ్యారెంటీ కార్డును ప్రవేశ పెట్టారు. రాజధాని నగరానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్, స్వచ్ఛమైన నీరు అందిస్తామంటూ కీలక హామీలను ఈ గ్యారెంటీ కార్డులో పొందుపరిచారు. మహిళా భద్రత, నీటి సరఫరా, యుమునా నది ప్రక్షాళన, రవాణారంగాన్ని మెరుగుపరచడం వంటి పలు అంశాలపై ప్రజలకుమరోసారి భరోసా ఇవ్వడం జరిగిందని ఆప్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్‌కు ప్రభుత్వ పని తీరును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పౌరసత్వ చట్ట సవరణ అంశంలో కేజ్రీవాల్ మౌనం మిగతా పార్టీలకు కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు..

ఇక కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం బీజేపీ బలం. కానీ గత కొన్ని నెలలుగా వివిధ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలను కోల్పోతూ వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా, కొద్ది మేర కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలం పువ్వు పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.

మరో వైపు దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆందోళనలు బీజేపీకి ఏవిధమైన ఫలితాన్నిస్తాయేనని ఆ పార్టీ నేతలు సతమతం అవుతున్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా బరిలోకి దిగడం కూడా బీజేపీకి కొంత నష్టం చేకూరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాయకుడు లేకుండా సమరంలోకి దిగడం బీజేపీకి కొత్త కాకపోయినా గత పరిణామాలు చేదు అనుభవాలనే చూపిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎలాంటి హామీలను ప్రకటించని బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన పేరుతో ఢిల్లీ ప్రజలకు చేరువవ్వాలని ప్రణాళిక రచించింది. ప్రజల సూచనలు, సలహాల మేరకు మేనిఫెస్టో రూపొందించి ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడం తో నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు..

ఇక ఈ సారి జరిగే ఎన్నికలకు భారీ స్థాయిలో ప్రచారానికి సిద్ధమైంది బీజేపీ. 20 రోజుల్లో సుమారు 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. స్థానిక ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు ఉండాలని బీజేపీ నాయకత్వం సూచించింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రోజుకు 3 లేదా 4 బహిరంగ సభలు నిర్వ హించనున్నారు. రోజుకు దాదాపు 250 సభలు ఉంటాయి. ప్రజలను ప్రత్యక్ష్యంగా కలుసుకోవడానికే చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనీసం 10 బహిరంగసభల్లో పాల్గొంటారని సమాచారం. ఢిల్లీ శాసన సభను కైవసం చేసుకోవడం ద్వారా గత సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో ఎదురైన ఓటమి అనుభవం నుంచి బయటపడేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది..

కాంగ్రెస్‌కు కూడా ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ ఈసారైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈ సారి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటున్న కాంగ్రెస్ హస్తిన ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆప్ ప్రభుత్వం వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చూస్తోంది. ప్రధానంగా మైనారిటీ ఓట్లను పూర్తిగా హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

షాహిన్ బాఘ్, శీలం బాగ్, జామా మసీద్ తదితర ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పట్ల వ్యతిరేకత కారణంగా వీరు కాంగ్రెస్‌కు ఓటేస్తారా? లేదా ఆమ్ ఆద్మీకి ఓటేస్తారా? అనేది కీలకం కానుంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైతే ఆప్ లాభపడుతుంది. అలా జరగకుండా.. 15 శాతానికి మించి ఓట్లను రాబడితే.. కేజ్రీవాల్ అవకాశాలకు గండిపడుతుంది. ఇక పాలనలో తనదైన ముద్ర వేస్తూ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు కేజ్రీవాల్. ఏది ఏది ఏమైనప్పటికి ఎన్నో లెక్కలు, సమీకరణల మధ్య మినీ ఇండియా ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తిగా మారింది..హస్తిన పీఠాన్ని దక్కించుకునే వారు ఎవరో తెలియాలి అంటే మాత్రం ఫిబ్రవరి 11 వరకు వేచి చూడాల్సిందే.