Corona Variants: ఊసరవెల్లి కరోనా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా..దేశంలో వివిధ ప్రాంతాల్లో తిష్టవేసిన రకాల వివరాలివే..
Corona Variants in India: కరోనా రెండో వేవ్ ఉధృతంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్ బయటపడుతున్నాయి.
Corona Variants: కరోనా రెండో వేవ్ ఉధృతంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్ బయటపడుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలోనూ ఒక్కొరకం స్ట్రెయిన్ విరుచుకుపడుతోంది. ఎక్కడెక్కడ ఏఏ రకాల కరోనా ప్రభావం ఉందో ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా తెలుసుకుంటూ వస్తోంది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏఏ రాష్ట్రాల్లో ఏ రకమైన కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిలో ఉందో వివరాలు ఇలా ఉన్నాయి ..
యూకే రకం..
ఉత్తరాది రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో డబుల్ మ్యుటెంట్ రకం ప్రాబల్యం ఎక్కువగా ఉందని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) చెబుతోంది. ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ ప్రకారం..దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,053 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టారు. భారత్లో B1.1.7గా పిలుస్తోన్న యూకే రకం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ గత నెలన్నర నుంచి చాలా ప్రాంతాల్లో వీటి విస్తృతి తగ్గింది. పంజాబ్ (482 శాంపిళ్లు), దిల్లీ (516), తెలంగాణ (192), మహారాష్ట్ర (83), కర్ణాటక (82) రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉన్నట్లు సుజీత్ సింగ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరిలో రెండుసార్లు, మార్చిలో నాలుగుసార్లు, ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు వీటికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలతో పంచుకున్నట్లు తెలిపారు.
డబుల్ మ్యుటెంట్..
ఇక B.1.617గా పిలిచే డబుల్ మ్యుటెంట్ వైరస్ ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉందని ఎన్సీడీసీ పేర్కొంది. మహారాష్ట్ర (761 శాంపిళ్లు)తో పాటు పశ్చిమబెంగాల్ (124), దిల్లీ (107), గుజరాత్ (102) రాష్ట్రాల్లో డబుల్ మ్యుటెంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా(B.1.315) ప్రభావం తెలంగాణ, దిల్లీ రాష్ట్రాల్లో కనిపించిందని ఎన్సీడీసీ వెల్లడించింది. ఇక బ్రెజిల్ రకం (P1) మాత్రం మహారాష్ట్రలో స్వల్పంగానే ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది.
జాగ్రత్తగా ఉండాలి..
కరోనా వైరస్ కొత్తరకాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపట్ల రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉండాలని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ హెచ్చరించారు. వీటి ప్రభావం ఉన్న జిల్లాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టడంతో పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్ భారీ స్థాయిలో చేపట్టే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. వీటి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలని ఎన్సీడీసీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా రాష్ట్రాలకు గట్టిగా సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Also Read: Fake Vaccination Link: వ్యాక్సినేషన్ పేరుతో నకిలీ లింక్లు.. క్లిక్ చేశారో అంతే సంగతులు..