కరోనా వలన రైల్వే శాఖ ఎంత నష్టపోయిందంటే!
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించింది. దీంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది.
Corona Effect on Indian Railways: అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించింది. దీంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే కరోనా సంక్షోభం కారణంగా భారతీయ రైల్వే ప్యాసింజర్ రైళ్లకు భారీ నష్టం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ల రైళ్ల నుంచి రూ.30 నుంచి రూ.35వేల కోట్ల ఆదాయాన్ని భారీగా కోల్పోవచ్చని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 10 నుంచి 15 శాతం ఆదాయాన్ని మాత్రమే రైల్వే పొందిందని ఆయన అన్నారు. కరోనాతో రైలు ప్రయాణాలను రద్దు చేయడం వలన ఆదాయంపై గండి పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ”ప్రస్తుతం రైల్వే 230 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతుంది. మన్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు” అని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు.
ఇక 2020 సంవత్సరంలో సరుకు రవాణాను 50శాతం పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఇక రైల్వే ఉద్యోగులను తగ్గించమని, చాలా మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
Read This Story Also: కరోనా మృతుల అంత్యక్రియల్లో అపోహలకు గురికావొద్దు