రాజస్తాన్ సంక్షోభం…గవర్నర్ తీరుపై అశోక్ గెహ్లాట్ వర్గం అసహనం..
రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శుక్రవారం రాత్రి కేబినెట్ సమావేశమై తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ కల్ రాజ్ మిశ్రా..
రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో శుక్రవారం రాత్రి కేబినెట్ సమావేశమై తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ కల్ రాజ్ మిశ్రా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు సుమారు 5 గంటలపాటు రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శనకు పూనుకొన్నారు. దీంతో అక్కడ హైడ్రామా వాతావరణం ఏర్పడింది. సీఎం గెహ్లాట్ బలనిరూపణకు శాసన సభను సమావేశపరచాలని కోరుతూ కేబినెట్ ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అనర్హత వేటు నుంచి సచిన్ పైలట్, ఆయన వర్గం బయటపడడంతో గెహ్లాట్ వర్గం ఆందోళన చెందుతోంది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియజేస్తూ అశోక్ గెహ్లాట్ గవర్నర్ కి ఓ జాబితా సమర్పించారు. అయితే తాను రాజ్యాంగంలోని 174 అధికరణం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు నిరసన విరమించారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో శాసన సభను ఎలా సమావేశపరచాలంటూ గవర్నర్ మొత్తం 6 పాయింట్లతో ఓ నోట్ ని ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై కేబినెట్ చర్చించింది.