
సీబీఎస్ఈ ఫలితాల తర్వాత రీ-ఎవాల్యుయేషన్, పోస్ట్ ఎగ్జామ్ సేవల కోసం దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక, చెల్లింపు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు చెల్లింపులు విఫలమవడం, డబ్బులు కట్ అయ్యి సేవలు అందకపోవడం, రిఫండ్ ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కీలకంగా చర్చించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ చెల్లింపు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నాలుగు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులను రంగంలోకి దింపుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కలిసి సీబీఎస్ఈ చెల్లింపు గేట్వే వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నాయి.
ఈ బ్యాంకులు సీబీఎస్ఈ పోస్ట్ ఎగ్జామ్ సేవల పోర్టల్తో సమన్వయం చేసుకుని.. విద్యార్థులు చెల్లింపులు సులభంగా చేయగలిగేలా కొత్త ప్రోటోకాల్స్ అమలు చేయనున్నాయి. ముఖ్యంగా చెల్లింపు లోపాలు తగ్గించడం, డబ్బులు రెండుసార్లు కట్ అయితే ఆటోమేటిక్ రిఫండ్ ఇవ్వడం, సర్వర్ సమస్యలు లేకుండా స్థిరమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నాయి. అంతేకాదు.. సీబీఎస్ఈ ప్రస్తుత పేమెంట్ గేట్వే వ్యవస్థను పూర్తిగా మార్చాలని ధర్మేంద్ర ప్రధాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..