Eggs Attack: ఒడిశాలో కొనసాగుతోన్న కోడిగుడ్ల రాజకీయం.. నిన్న సీఎం.. నేడు మహిళా ఎంపీలపై దాడులు..
ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీల మంత్రులు, నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పైనే బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు..
ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీల మంత్రులు, నేతలపై కోడిగుడ్ల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పైనే బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. పూరీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ తిరిగి వస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. తాజాగా బీజేడీ మహిళా ఎంపీ అపరాజితా సారంగిపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తిరిగి వస్తోండగా బనమాలిపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలకు నిరసనగా నల్లజెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు మహిళా మంత్రి వాహనం రాగానే కోడిగుడ్లు విసిరారు.
కాగా ఈ దాడిపై ఎంపీ ప్రతినిధి ధనేశ్వర్ బారిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ సంఘటనతో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు తమ వాహనంపై కోడిగుడ్లతో పాటు రాళ్లు కూడా రువ్వారని, వారి వద్ద కత్తులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని బారిక్ పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు ముందు బాలాసోర్ రైల్వే స్టేషన్ కొత్త భవనం శంకుస్థాపనకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగితో పాటు బీజేడీ ఎమ్మెల్యే స్వరూప్ దాస్ హాజరయ్యారు. మోడీ వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందని..కాదు నవీన్ వల్లే ఇది సాధ్యమైందని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎంపీ, ఎమ్మెల్యేల సూచనలతో కార్యకర్తలు శాంతించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయురాలు మమితా మెహర్ హత్య వెనుక బీజేడీ మంత్రి దివ్యశంకర్ మిశ్రాకు సంబంధముందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచి బీజేడీ నేతలు, మంత్రులపై ఇలా వరుసగా దాడులు జరుగుతున్నాయి.
Also Read:
Inspiration: కూలీ కొడుకు నీట్ కొట్టాడు.. ఆ గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు
అవసరానికి మించి ఆహార నిల్వలున్నా ఎగుమతి చేయలేకపోతున్నాం.. కారణమేంటంటే…?