Bihar Political Crisis: NDA కూటమికి జేడీయు గుడ్బై.. నితీశ్ది విశ్వాస ఘాతుకమంటూ BJP ధ్వజం
సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. తనకు 160 మందికి పైగా ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న విషయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు నితీశ్ చెప్పారు.
Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (జేడీయు చీఫ్).. మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్తో చేతులు కలిపారు. బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆ మేరకు గవర్నర్ ఫగు చౌహాన్ను పాట్నాలోని రాజ్భవన్లో కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం లాలూ సతీమణి, బీహార్ మాజీ సీఎం రాబ్రీ దేవి నివాసంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో నితీశ్ భేటీ అయ్యారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వారు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే వారి మధ్య డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తేజస్వి యాదవ్కు హోం శాఖను ఇవ్వనున్నట్లు సమాచారం.
సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. తనకు 160 మందికి పైగా ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న విషయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు నితీశ్ చెప్పారు.
#WATCH | All MPs and MLAs reached a consensus that we should leave the NDA. Soon after, I resigned as Bihar CM, says Nitish Kumar.#Bihar pic.twitter.com/ov8ds5ughO
— ANI (@ANI) August 9, 2022
నితీశ్ కుమార్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపించింది. 2020 ఎన్నికల్లో బీజేపీ, జేడీయు ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసినట్లు బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినా.. పెద్ద మనస్సుతో నితీశ్ కుమార్ను సీఎం చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం బీహార్ ప్రజలు, బీజేపీని వంచించడమేనని ఆరోపించారు.
బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఎల్జేపీ (రాంవిలాస్ వర్గం) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్కు ఓ సిద్ధాంతమంటూ లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి జరిగే తదుపరి ఎన్నికల్లో జేడీయు కేవలం 0 స్థానాలకు పరిమితం అవుతుందన్నారు. మరోసారి బీహార్ ప్రజల తీర్పును నితీశ్ కుమార్ వమ్ము చేశారంటూ ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్కున్న విశ్వసనీయత జీరోకి పడిపోయిందంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన నేపథ్యంలో నితీశ్ కుమార్, మహాకూటమికి బేషరతు మద్ధతు ఇస్తున్నట్లు జితన్ రాం మాంజి నేతృత్వంలోని HAM ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..