
బిహార్లో కాసేపట్లో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. బీజేపీ మద్దతుతో సీఎంగా నితీష్ ప్రమాణం చేస్తారు. ఆయనతోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఐదున్నరకు కొత్త కేబినెట్ తొలి భేటీ నిర్వహిస్తారు. అంతకుముందు- బిహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే నితీష్కుమార్..మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలిశారు. బీజేపీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు సరిపడా మెజారిటీ ఉందన్నారు.. నితీష్కుమార్. తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్ చెప్పారు.
రాజ్భవన్లో నితీష్కుమార్ మళ్లీ CMగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. బీజేపీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌధరి, బిహార్ విపక్ష నేత విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారు.
కాగా.. కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు CM పదవికి నితీష్ రాజీనామా చేశారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు విజ్ఞప్తి చేశారు. మహాకూటమిని తాను విడిచిపెట్టేసినట్లు నితీష్ ప్రకటించారు. ఈ ప్రభుత్వ కథ ఇక ముగిసిందని చెప్పారు. కూటమి నుంచి తాను ఎందుకు బయటకు వచ్చానో నితీష్ వివరించారు. ఏడాదిన్నరగా కూటమి సరిగా పనిచేయడం లేదన్నారు. ఇండియా కూటమిలో కొనసాగడం తమ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు నితీష్.
కాగా.. బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాజకీయ భాగస్వాములను మార్చడం నితీష్కు అలవాటేనని.. నితీష్కుమార్ ఊసరవెల్లికే పోటీ ఇస్తున్నారన్నారని ట్వీట్ చేశారు. నితీష్ రాజీనామా తమను ఆశ్చర్యపర్చలేదని.. కానీ, నితీష్ పదేపదే ఇలా చేయడం సరికాదంటూ పేర్కొన్నారు. రాహుల్ న్యాయయాత్రను అడ్డుకోవడానికే ఈ డ్రామా అంటూ విమర్శించారు.
నితీష్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తనను ఇన్నాళ్లు బీజేపీ బీటీమ్ అని విమర్శించిన నితీష్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. బిహార్ ప్రజలను మోసం చేసిన్నందుకు ప్రధాని మోదీ , నితీష్ , తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య మాత్రం నితీష్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. నితీష్ను చెత్తతో పోల్చారామె. చెత్త, మళ్లీ చెత్తబుట్టలోకే వెళ్లిందని నితీష్పై ఆమె ట్వీట్ చేశారు.
మరోవైపుకు తమకు హ్యాండిచ్చిన నితీష్కుమార్పై ఆర్జేడీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హాజీపూర్లో నితీష్ దిష్టిబొమ్మను తగలబెట్టారు ఆర్జేడీ కార్యకర్తలు. నితీష్ పచ్చి అవకాశవాదంటూ నినాదాలు చేశారు.
మహాకూటమికి గుడ్బై చెప్పిన తర్వాత, కాంగ్రెస్ మీద JD-U విమర్శల బాణాలను ఎక్కుపెట్టింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని JD-U నేత KC త్యాగి ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేయాలని భావిస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీలను తొక్కిపెట్టి, తాను నాయకత్వం వహించాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..