Kerala: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. 190 పందులను చంపి పూడ్చి పెట్టిన అధికారులు
కరోనా (Corona) పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న భారత్ పై ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (African Swine Flu) పంజా విసురుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ ఆందోళన కలిగిస్తుండగా తాజాగా ఆఫ్రికన్ స్వైల్ ఫ్లూ విజృంభణ కునుకులేకుండా చేస్తోంది....
కరోనా (Corona) పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న భారత్ పై ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (African Swine Flu) పంజా విసురుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ ఆందోళన కలిగిస్తుండగా తాజాగా ఆఫ్రికన్ స్వైల్ ఫ్లూ విజృంభణ కునుకులేకుండా చేస్తోంది. కేరళలోని వయనాడ్ జిల్లా మనంతవాడి ఫ్రాంతంలోని పొలాల వద్ద పందుల పెంపకం కేంద్రంలోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పందులను చంపేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో (Bhopal) ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీసెస్ సంస్థలో పందుల నమూనాలను పరీక్షించారు. పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో వాటిని చంపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం) 190 పందులను వధించి.. పూడ్చి పెట్టారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని వయనాడ్ జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గతంలో త్రిపుర (Tripura) రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవిపూర్లో జంతువనరుల శాఖ నిర్వహిస్తున్న పందుల ఫామ్లో ఈ కేసులను గుర్తించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఫామ్లోని చాలా పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటివరకూ ఆ ప్రాంతంలో ఆఫ్రికన్ ఫ్లూ బారినపడి 63 వరకు పందులు మృతిచెందాయి. ఏప్రిల్ 7న 3 శాంపిల్స్ సేకరించిన బృందం పరీక్షల కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీ (NERDDL)కి పంపింది. ఏప్రిల్ 13న PCR ఫలితాలు వచ్చాయి. అందులో అన్ని శాంపిల్స్ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్గా (ASF) ఉన్నట్లు నిర్ధారించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి